ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, అందరూ నిశ్చింతగా ఉండాలని నటుడు శివాజీ సూచించారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత ఆయన పోలింగ్ సరళిపై స్పందించారు. ఈ మేరకు శనివారం వీడియో విడుదల చేశారు. బీజేపీ, వైఎస్సార్ సీపీ కలిసి కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నాయని, వాటిని ఎవరూ నమ్మొద్దని సూచించారు.
పీఏఆర్సీ అనే పేపర్ ను పట్టుకుని తామే విజయం సాధించబోతున్నట్టుగా బీజేపీ డ్రామా మొదలుపెట్టిందని విమర్శించారు. దాని ప్రకారం ఎన్టీఏకు 39, కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ కు 33 సీట్లు వస్తాయని చెబుతోందన్నారు. అంటే టీఆర్ఎస్ కు 16 సీట్లు, వైఎస్సార్ సీపీకి 17 ఎంపీ సీట్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారని, మొత్తమ్మీద తొలి దశ ఎన్నికల్లో ఎన్డీఏకు 72 స్థానాలు వస్తాయని జనాన్ని నమ్మించాలని చూస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం నుంచి ఈ ప్రచారం మరింత ఉధృతం చేశారన్నారు. ఎట్టకేలకు చిన్నచిన్న ప్రమాదాలతో, హత్యలతో, హింసతో ఏపీ ఎన్నికలు పూర్తయ్యాయని, ప్రజలంతా ఐక్యతతో ఉండటంతోనే ప్రశాంతంగా ముగిశాయని శివాజీ వ్యాఖ్యానించారు. తీర్పు ఏకపక్షంగా ఉందని, మళ్లీ ప్రజాప్రభుత్వం ఏర్పడబోతోందని పేర్కొన్నారు.
‘‘ఏపీ ప్రజలు ఒకవైపే ఉన్నారు. మే 23న ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇందుకు సంబంధించి ముఖ్యంగా రెండు అంశాలు మనం గమనిద్దాం. చంద్రబాబుని ఓడించడానికి మహిళలంతా అర్ధరాత్రి వరకు రోడ్డుపై ఉండి జగన్ కు ఓటేయాలి. చంద్రబాబు అంత దుర్మార్గుడు లేడనే ఉద్దేశంతో ఆయనకు ఓటేయాలి. ఇక రెండోది.. జగన్ రాకపోతే మా బిడ్దల భవిష్యత్తు ఏమైపోతుందో అని భయంతో మహిళలు, వృద్ధులు అందరూ ఏకమై జగన్ కు ఓటేయాలి. ఈ రెండే కారణాలతో జగన్ గెలవాలి. లేకపోతే పూర్తి మెజార్టీతో చంద్రబాబు గెలుస్తారు. అంతే కదా.. కానీ ఈ విషయంలో బీజేపీ ఆడుతున్న డ్రామను మరింత ఉధృతం చేశారు. చంద్రబాబు ఓడిపోతున్నాడని, జగన్ గెలుస్తున్నారని వీడియోలు రిలీజ్ చేశారు. జగన్ బెస్ట్ సీఎం అంటూ ప్రశాంత్ కిషోర్ పొగుడుతూ ఉన్న ఇంటర్నల్ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈవీఎంలపై పోరుకు ఢిల్లీ వెళ్లడాన్ని ఆయన బలహీనతగా చూపించడానికి వైఎస్సార్ సీపీ నేతలు ప్రయత్నాలు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా బాబు వ్యూహాన్ని గమనించలేక భయపడిపోతున్నారు. కానీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మే 23న వెలువడబోయే తీర్పు అనూహ్యంగా ఉండబోతోంది. మళ్లీ ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఎవరూ అనవసరంగా భయపడి ఆందోళన చెందొద్దు’’ అని శివాజీ సూచించారు.
కాగా, తాను ఎవరి పక్షమూ కాదంటూ చెబుతున్న శివాజీ.. గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాను టీడీపీకి వత్తాసు పలకడంలేదని చెబుతూనే ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా కనిపించారు. ఆపరేషన్ గరుడ పేరుతో బీజేపీ కుట్ర చేస్తోందంటూ వీడియో విడుదల చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, ఆయన టీడీపీ వ్యక్తి అని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ఇందుకు సంబంధించి తాజాగా మంత్రి నారాయణ పీఏ, మధు అనే వ్యక్తితో మాట్లాడిన ఆడియో సంభాషణ వెలుగులోకి తెచ్చి శివాజీ గురించి ఇదీ అసలు నిజం అని పేర్కొన్నారు. అందులో శివాజీకి రూ.10 కోట్లు ఇస్తున్నామని, ఆ మొత్తం నారాయణే సమకూరుస్తున్నారని ఆయన పీఏ చెప్పినట్టుగా ఉంది. ఈ వార్త పత్రికలో వచ్చినప్పటికీ, దీనిపై వారెవరూ కాదని స్పందించకపోవడం గమనార్హం.