ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని ఎన్నికల విధులకు దూరంగా వుంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చీఫ్ సెక్రెటరీ, డీజీపీ మీద కూడా విమర్శలున్నాయి. ఈ క్రమంలో వారిపైనా వేటు పడబోతోందన్న ప్రచారం జరుగుతోంది.
పోలీస్ అధికారులపైనా, ఐఏఎస్ అధికారులపైనా రాజకీయ విమర్శలు కొత్తేమీ కాదు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. గతంలో, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేటాపైనా వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది.
ఇలా ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు, ఎన్నికల విధులకు దూరంగా వుండాల్సి రావడం కొత్త కానప్పుడు, ఇప్పుడు జరుగుతున్న బదిలీ వేటు వ్యవహారాలపై వైసీపీ ఎందుకు అంతలా ఉలిక్కిపడుతోంది.? పైగా, ఐపీఎస్ అలాగే ఐఏఎస్ అధికారుల తరఫున ఆయా అధికారుల సంఘాలెందుకు ‘అతి’ చేస్తున్నాయి.? అన్న చర్చ సామాన్యుల్లో జరుగుతోంది.
ఏ పోలీస్ అధికారి ఎలాంటివారు.? ఏ ఐఏఎస్ అధికారి ఎలాంటివారు.? అన్నది రాజకీయ పార్టీలకంటే ఓటర్లకే బాగా తెలుసు. ఓటర్లు అన్ని విషయాల్నీ పరిశీలిస్తారు, అర్థం చేసుకుంటారు. కాకపోతే, సమయం కోసం ఎదురు చూస్తుంటారంతే.
హత్యలు జరిగినప్పుడు కూడా, దోషుల్ని వదిలేసి.. బాధితుల మీద కేసులు పెట్టిన సందర్భాలున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. ఈ విషయాలే ఎన్నికల వేళ రాజకీయ రచ్చబండల దగ్గర చర్చనీయాంశమవుతున్నాయి.. ప్రజలు అన్ని విషయాల్నీ బేరీజు వేసుకుంటున్నారు.
‘వైసీపీ ఇంతలా ఉలిక్కిపడుతోందంటే, ఎన్నికల వేళ తమ రాజకీయ అవసరాల కోసం ఆయా అధికారుల్ని వైసీపీనే నియమించుకుని వుండాలి..’ అన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. ‘సీఎస్, డీజీపీని మార్చితేనే ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతాయ్.. లేదంటే, ఇతర అధికారుల్ని మార్చినా ఏం ఉపయోగం లేదు..’ అన్నది మెజార్టీ ప్రజల అభిప్రాయంగా కనిపిస్తోంది.