జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే ‘దత్త పుత్రుడు’ అంటూ చిల్లర విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అవి చిల్లర విమర్శలు గనకనే, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ‘పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడు కాదు.. దత్తాత్రేయ పుత్రుడు’ అని తీర్మానించేశారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పిఠాపురంలో రాయలసీమ మార్కు రాజకీయాన్ని అమలు చేసేందుకు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని రంగంలోకి దించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
కాపు సామాజిక వర్గంలో చీలిక తెచ్చే క్రమంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో పవన్ కళ్యాణ్ మీద తీవ్రాతి తీవ్రమైన విమర్శల్నీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుని పక్కన పెట్టిన వైఎస్ జగన్, తెరవెనుక ఆ పెండెం దొరబాబుతోనే రాజకీయం చక్కబెట్టిస్తుండడం మరో చీప్ పొలిటికల్ ట్రిక్గా చెప్పుకోవచ్చు.
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినీ పిఠాపురంలోనే వైఎస్ జగన్ మోహరింపజేశారు. ఒక్క పిఠాపురంపై వైసీపీ నుంచి ఇంత పెద్దయెత్తున ‘రాజకీయ దాడికి’ వైసీపీ వ్యూహం సిద్ధం చేసిందంటే, అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభంజనాన్ని నిలువరించేందుకే.
అయితే, పిఠాపురం ప్రజానీకం మాత్రం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో, జనసేన అభ్యర్థిగా అడుగు పెట్టిన జనసేనానికి ‘జై’ కొట్టేందుకు ఓటర్లు ఎగబడ్డారు.. జనసంద్రాన్ని తలపించాయి పిఠాపురం రోడ్లు. అయితే, ఏవో కుంటి సాకులు చెప్పి, వారాహి వాహనానికి పోలీసులు ఆటంకాలు కల్పించినట్లు తెలుస్తోంది.
పొత్తు ధర్మం విస్మరించి, పవన్ కళ్యాణ్కి ఎదురు తిరిగినట్లుగా కనిపించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటే వుండి, టీడీపీ శ్రేణుల్ని జనసేన శ్రేణులతో కలిపారు. వర్మ ఇంటికి వెళ్ళిన పవన్ కళ్యాణ్, వర్మ తల్లిగారి నుంచి ఆశీస్సలు తీసుకోవడం గమనార్హం.
కాకినాడ లోక్ సభ నియోజకవర్గానికి జనసేన నుంచి పోటీ చేస్తున్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సహా పలువురు జనసేన నాయకులు, అలాగే టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ వెంట వున్నారు. లక్ష మెజార్టీకి తగ్గకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని పిఠాపురం నుంచి గెలిపించుకుంటామనే నినాదాలు పిఠాపురం రోడ్లపై హోరెత్తాయి.
టీడీపీ – జనసేన శ్రేణుల మధ్య సమన్వయం చూస్తోంటే, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే సమన్వయం కొనసాగుతుందన్న నమ్మకం ఇరు పార్టీల అధినాయకత్వాలకీ కలుగుతోంది.
దత్తాత్రేయ పుత్రుడు పవన్ కళ్యాణ్కి పీఠికాపురం (పిఠాపురంను అలాగే పిలుస్తారు) ఘన స్వాగతం పలుకుతోందని అటు పిఠాపురం సాధారణ ప్రజలతోపాటు, టీడీపీ, జనసేన శ్రేణులూ నినదించడం కొసమెరుపు.