TSRTC: తెలంగాణ ఆర్టీసీ (TSRTC)లో మహిళలకు ఉచిత ప్రయాణమని కాంగ్రెస్ హామీ ఇవ్వడం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. వెంటనే హామీ అమలు చేయడం జరిగిపోయాయి. అప్పటినుంచీ మిశ్రమ స్పందనే వస్తుందని చెప్పాలి. బస్సుల్లో మహిళా ప్రయాణికులు పెరిగారు. దీంతో పురుషులకు, విద్యార్ధులకు సీట్లు దొరకటం లేదు. దీంతో డబ్బులిచ్చి నిలబడి ప్రయాణం చేస్తున్నామంటూ పురుషులు.. బస్సులు ఖాళీలేక స్కూలు, కాలేజీలకు వెళ్లడం ఇబ్బందవుతోందని విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సుల్లో రద్దీని, గొడవలు తట్టుకోలేకపోతున్నామని డ్రైవర్, కండక్టర్లు ఉన్నతాధికారులకు మొర పెట్టుకుంటున్నారు.
ఈక్రమంలో ముఖ్యమైన రూట్లు, సమయాల్లో పురుషులకు, విద్యార్ధులకు ప్రత్యేక బస్సులు నడపాలని.. లేదంటే మహిళలకే ప్రత్యేక బస్సులు నడపాలని, వృద్ధులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఆర్టీసీ ఆలోచిస్తోందని తెలుస్తోంది.. గతంలో రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య దాదాపు 14లక్షలు ఉండగా ప్రస్తుతం 30లక్షల వరకూ ఉంటోందని అంటున్నారు. పల్లెల నుంచి పట్టణాలకు.. పట్టణాల నుంచి పల్లెలకు ఆఖరి బస్సులో రద్దీ ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది. దీంతో ఉన్నతాధికారులు సమస్యపై దృష్టి పెట్టినట్టు సమాచారం.