Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) షో విజయవంతంగానే ముగిసినా.. తదనంతర పరిణామాలు షోపై ప్రభావం చూపాయి. విజేతగా పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) నిలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట కొందరు సృష్టించిన అలజడి అతనిపైనా ప్రభావం చూపాయి. ఫలితంగా జూబ్లీహిల్స్ లో ఆర్టీసీ బస్సుల ధ్వంసం, దాడి ఘటనల కేసులో ఎ-1 నిందితుడిగా కూడా నిలిచాడు.
కేసులో ఎ-1 పల్లవి ప్రశాంత్, ఎ-2గా అతని సోదరుడు మనోహర్, ఎ-3గా అతని స్నేహితుడు వినయ్, ఎ-4గా ఉప్పల్ మేడిపల్లికి చెందిన సాయికిరణ్, అంకిరావుపల్లి రాజును చేర్చారు. సాయికిరణ్, రాజు లాంగ్ డ్రైవ్స్ కార్స్ లో డ్రైవర్లుగా పని చేస్తున్నారు.
బిగ్ బాస్ ఫలితాల అనంతరం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆదివారం రాత్రి పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానులు గొడవలకు దిగి వాహనాలను ధ్వంసం చేశారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని భీతావాహ పరిస్థితులు సృష్టించారు. ప్రస్తుతం సాయికిరణ్, రాజును అరెస్టు చేసి రెండు కార్లు సీజ్ చేశారు.