అసెంబ్లీలో బూతులు మాట్లాడొచ్చు.. అదీ నిర్లజ్జగా.! జనం సొమ్ముతో నిర్వహించే అధికారిక బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి సహా, మంత్రులు సైతం నిస్సిగ్గుగా ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడొచ్చు.! మీడియా ముందు మంత్రులు ఎలాంటి మొహమాటం లేకుండా బూతులతో విరుచుకుపడిపోవచ్చు.!
కొత్త రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెట్ చేయబడింది.! ఔను, ఇది నిజ్జంగా నిజం.! రాజకీయ పార్టీలకు సంబంధించిన వేదికలపై ఎవరెలా మాట్లాడుకున్నా, అది వారి విజ్ఞత.! కానీ, ప్రజా ధనం ఖర్చు చేస్తున్న వేదికలపై అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే, తద్వారా వృధా అయ్యే ప్రజాధనం సంగతేంటి.?
ఒక్కో బహిరంగ సభ కోసం ప్రభుత్వం తరఫున 10 కోట్ల వరకు ఖర్చవుతోందన్నది ఓ అంచనా. ఈ లెక్కల్లో నిజమెంత.? అన్నదానిపై ప్రభుత్వమే ప్రజలకు వివరణ ఇవ్వాల్సి వుంది. అది వేరే చర్చ. ఆయా వేదికలపై ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు.? మంత్రులు ఏం మాట్లాడుతున్నారు.?
ఈ తరహా బహిరంగ సభలకు సంబంధించి అధికార యంత్రాంగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంటుంది. తీసుకోవాలి కూడా.! ముఖ్యమంత్రి భద్రత ఎంత ముఖ్యమో, ఆయా వేదికలపై రాజకీయ ప్రసంగాల ద్వారా ఖర్చవుతున్న ప్రజాధనంపై లెక్క కూడా అంతే ముఖ్యం.
చిన్న పిల్లలు పాల్గొంటున్న సభల్లో, రాజకీయ ప్రత్యర్థుల వైవాహిక జీవితాల గురించి నిర్లజ్జగా మాట్లాడుతోంటే, ‘ఇది తప్పు’ అని ప్రశ్నించలేని అధికార యంత్రాంగం వుంటే ఎంత.? ఊడితే ఎంత.? అన్న భావన ప్రజల్లో అస్సలు కలగకూడదు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ భావన కలుగుతోంది.!
మంత్రిగారు బూతులు మాట్లాడితే, ముఖ్యమంత్రి ముసి ముసి నవ్వులు నవ్వడం. పైగా, ప్రశంసించడం. ఇదెక్కడి సంస్కృతి. అంటే, భవిష్యత్ తరాలకు వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన సంకేతం పంపుతోందన్నమాట. అధికార పీఠమెక్కితే చాలు.. అడ్డగోలుగా మాట్లాడొచ్చని. తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా, వాళ్ళు తమను తిట్టుకోవచ్చని వైసీపీ ‘స్టాంప్ వేసి’ మరీ చెబుతున్నట్లుంది పరిస్థితి.
ఇదేం రాజ్యాంగం.? గవర్నర్ వ్యవస్థ ఏం చేస్తోంది.? న్యాయ వ్యవస్థ.. చట్టం.. ఇవన్నీ వీటికి వర్తించవా.?