‘మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం.. ఈసారి, 151 కాదు.. ఏకంగా 175 కొట్టబోతున్నాం..’ అంటూ వైసీపీ అధినాయకత్వం పదే ప్రకటనలు చేసేస్తోన్న సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ అనే నినాదంతో, రకరకాల పార్టీ కార్యక్రమాల్ని ప్రభుత్వం తరఫున నిర్వహించేస్తున్నారు కూడా.!
ఇంతా చేసి, వైసీపీ సాధించేది ఏంటి.? వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయ్.? తాజాగా వెలుగు చూసిన ఓ సర్వే ప్రకారం చూస్తే, వైసీపీ కేవలం 100 సీట్లకే పరిమితమవుతుందట. మామూలుగా అయితే, ఇప్పుడున్న పరిస్ధితుల్లో వైసీపీకి ఇది మంచి ‘ఫిగర్’.! ఇదే ఫిగర్ వస్తే, వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుంది కూడా.
ఇందులో వైసీపీ చింతించడానికేమీ లేదు. టీడీపీ – జనసేన కలిసి, మిగతా సీట్లను దక్కించుకుంటాయన్నది సదరు సర్వే సారాంశం. 100 నుంచి 115 వరకు.. వైసీపీకే.. అంటూ ప్రచారంలోకి వచ్చిన ఈ సర్వే వెనుక అసలు కథ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
ఎందుకంటే, ఈ సర్వే గురించి ప్రచారం చేసుకుంటున్నదే వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారులు మరి.! అదేంటి, అధినేత వైఎస్ జగన్, ‘వై నాట్ 175’ అంటోంటే, ఈ సెంచరీ గోలేంటి.? అది మరి, అసలు మ్యాజిక్ అంటే.!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న ‘వై నాట్ 175’ని ఆ పార్టీ శ్రేణులే నమ్మడంలేదన్నమాట. ‘మాకు ఓ సెంచరీ వస్తే చాలు..’ అని చెప్పుకుంటున్నారు వైసీపీ మద్దతుదారులు. చాలామంది వైసీపీ నేతలూ, ఈ ఫిగర్ మీద చాలా ఆశలు పెట్టుకుంటుండడం తెలిసిన విషయమే.
పలువురు సీనియర్ వైసీపీ నాయకులు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఇంకోపక్క, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సిట్టింగులకు సీట్లు ఇవ్వడానికి వైఎస్ జగన్ కొంచెం తటపటాయించేలా వున్నారట.!
ఎలా చూసుకున్నా, వైసీపీ, వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం నిలబెట్టుకునే స్థాయిలో లేదన్న విషయం స్పష్టమవుతోందన్న చర్చ అయితే, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.