జన సేన పార్టీకి మాజీ మంత్రి, కాపు నేత చేగొండి హరి రామ జోగయ్య ఓ లేఖ రాశారుట.! ఆ లేఖని మామూలుగా అయితే, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకోవాలి.! కానీ, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి.. అన్న చందాన, చేగొండి హరి రామ జోగయ్య, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి రాసిన లేఖ మీద చాలా చాలా హడావిడి చేసేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
‘చంద్రబాబు జిత్తుల మారి పొత్తులను ఘాటు లేఖతో ఎండగట్టిన హరి రామ జోగయ్య. ప్యాకేజీ కోసం బాబుకి జనసేన పార్టీని పవన్ తాకట్టు పెట్టినా, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా హరి రామ జోగయ్య కొన్ని డిమాండ్లను తెరపైకి తెచ్చారు. జనసేనకి కనీసం 50 సీట్లు ఇవ్వాలి, రెండున్నరేళ్ళు పవన్ సీఎంగా వుండాలి. ఈ డిమాండ్లకు అంగీకరిస్తేనే కాపు సామాజిక వర్గం ఓట్లు టీడీపీకి వేస్తామని తేల్చి చెప్పేసిన పెద్దాయన. వైఎస్సార్సీపీని గద్దె దించడమంటే టీడీపీని పవర్లోకి తీసుకురావడం కాదని పవన్ కళ్యాణ్కి చురకలంటించారు..’ అంటూ వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ ఒకటి పడింది.. చేగొండి హరిరామ జోగయ్య రాశారని చెబుతున్న లేఖతోపాటు.
ఈ తరహా ఫేక్ లెటర్స్ సృష్టించడం వైసీపీకి అలవాటైన విద్యే. గతంలో పలు పేక్ లెటర్స్ విషయమై స్వయంగా చేగొండి హరిరామ జోగయ్య వైసీపీకి గడ్డిపెట్టిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
అందునా, రెడ్లకీ అలాగే కమ్మ సామాజిక వర్గాలకేనా అధికారం.? కాపులకెప్పుడు అధికారం.? బీసీ, ఎస్సీ ఎస్టీలకెప్పుడు అధికారం.? అని కూడా ఆయన వైసీపీ పోస్ట్ చేసిన లెటర్లోని ఏకి పారేశారు.
సరే, ఆ విషయం పక్కన పెడితే, జనసేన పార్టీకి వైసీపీ ఎందుకు ఉచిత సలహాలు ఇస్తున్నట్లు.? ఏ నియోజకవర్గంలో ఎవర్ని పోటీలో పెట్టాలి.? అన్న విషయమై సిట్టింగుల్ని పీకేసి మరీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది వైసీపీ. జనసేన పార్టీకి కూడా కొన్ని ఆలోచనలు వుంటాయి కదా.?
అయినా, జనసేనకు సలహాదారుగా మారిపోవాలన్న ఆలోచన వైసీపీకి ఎందుకు వచ్చిందో ఏంటో.! ఈ బోడి సలహాల్ని ఎలాగూ జనసేన పార్టీ పట్టించుకోదు. మరెందుకీ తాపత్రయం.? అసహనం, ఆందోళన… వైసీపీ కష్టం పగవాడిక్కూడా రాకూడదేమో.!