తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వైయస్సార్టీపీ( వైయస్సార్ తెలంగాణ పార్టీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila) ప్రకటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలందరూ కాంగ్రెస్ కి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని, ఆ పార్టీ గెలుపు అవకాశాన్ని దెబ్బతీసే ఉద్దేశం లేదన్నారు. అధికారం మారే అవకాశం వచ్చినప్పుడు దాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. తమ పార్టీ కార్యకర్తలందరూ కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు.
షర్మిల భావోద్వేగం…
ఎన్నికల్లో భాగంగా ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు షర్మిల తొలుత ప్రకటించిన విషయం తెలిసిందే. అదే స్థానం నుంచి కాంగ్రెస్ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కి అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకి మద్దతు ఇవ్వాలని చెబుతూ షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. 2013 లో పాదయాత్ర చేస్తున్నప్పుడు పొంగులేటి తనకు అండగా నిలిచారని.. ఓదార్పు యాత్ర సమయంలోనూ తనకు మద్దతుగా ఉన్నారని అలాంటి వ్యక్తిపై పోటీ చేసే ఉద్దేశం తనకి లేదని అన్నారు. గెలుపు కంటే త్యాగం గొప్పదని.. ఈ సమయంలో తనని అర్థం చేసుకోవాలని, తన నిర్ణయం ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతూ షర్మిల ఎమోషనల్ అయ్యారు.