Yediyurappa: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప (Yediyurappa) పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్రంలో అలజడి రేపింది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్న వేళ ఆయనపై ఇంతటి ఆరోపణలు కర్ణాటక రాజకీయాల్లో కీలక కుదుపు అనే చెప్పాలి. 17ఏళ్ల బాలికపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదులో ఆయనపై పోక్సో (Pocso) కేసు నమోదైంది.
ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగిందని పోలీసులు చెప్తున్నారు. వివరాల ప్రకారం.. మోసం కేసులో న్యాయం కోసం తల్లి, 17ఏళ్ల బాలిక యడ్యూరప్ప వద్దకు వెళ్లారు. ఆ సమయంలో బాలికను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్యూరప్పపై కేసు నమోదు చేశారు.
ఆరోపణలను ఆయన కార్యాలయం ఖండించింది. ఆమె గతంలోనూ ఇటువంటి ఫిర్యాదులు చేశారని పేర్కొంది. మరోవైపు.. ఈ ఆరోపణలపై యడ్యూరప్ప కుటుంబం నుంచి స్పందన ఇంకా రాలేదు. ప్రస్తుతం యడ్యూరప్ప బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా ఉన్నారు.