YS Jagan- Avinash Reddy: అసలు ఇదెలా సాధ్యం.? కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు వద్దనుకుంటారు.? ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తనకు రెండు కళ్ళుగా చెప్పుకునే.. వివేకానంద రెడ్డి.. అవినాష్ రెడ్డిల విషయంలో.. ఓ కన్ను ఆల్రెడీ ఔట్ అయిపోయింది.!
ఓ కన్ను ఇంకో కన్నుని ఎలా పొడుస్తుంది అధ్యక్షా.? అంటూ అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కానీ, ఓ కన్ను.. అదే వైఎస్ వివేకానంద రెడ్డిని, ‘మహిళలపై దారుణాలకు పాల్పడే వ్యక్తిగా’ వైసీపీ అభివర్ణిస్తోంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నోరు మెదపలేకపోయారు.
వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చుకున్నారట.. మహిళలపై వేధింపులకు పాల్పడేవారట.. సెటిల్మెంట్లు చేసేవారట.. ఇవన్నీ వైసీపీ చేసిన ఆరోపణలే. అంతకు ముందు మాత్రం వైఎస్ వివేకానంద రెడ్డి అంటే, అత్యంత సౌమ్యుడు.!
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ఉచ్చు బిగుసుకోవడంతో, నిర్లజ్జగా.. ‘వివేకం సార్’ మీద ఆరోపణలు చేసేశారు. ఒకవేళ, అవినాశ్ రెడ్డిని కూడా వైఎస్ జగన్ వదిలేసుకోవాలనుకుంటే, ఆ తర్వాత అవినాశం మీద వచ్చే వైసీపీ ఆరోపణలు ఎలా వుంటాయబ్బా.?
ఈ విషయమై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ కనిపిస్తున్నాయి. ‘ఇక అవినాశ్ రెడ్డిని కాపాడలేం. వదిలేసుకోవడమే మంచిది. ఇప్పటికే పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. పైగా, తనను తాను అత్యంత బలవంతుడిగా అవినాశ్ రెడ్డి భావిస్తున్నారు.. ఇది పార్టీకి మంచిది కాదు..’ అంటూ వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందిట.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం అక్రమాస్తుల కేసులో తేలిగ్గానే అరెస్టయ్యారు. అలాంటిది, హత్య కేసులో అవినాశ్ రెడ్డి సీబీఐ నుంచి తప్పించుకుంటున్న తీరు.. సహజంగానే వైసీపీ అధినాయకత్వానికి కంటగింపుగా వుంటుందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.