మహేంద్ర సింగ్ ధోని… టీమిండియాను రెండు సార్లు విశ్వవిజేతగా నిలిపిన ఘనుడు. ఎమ్మెస్ ధోని సారథ్యంలోనే టీమిండియా 2007 టి20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిపించి, మూడు ఐసీసీ ప్రధాన ఈవెంట్స్ ను గెలిపించిన మొదటి టీమిండియా కెప్టెన్ అయ్యాడు ధోని.
అతని సారథ్యంలోనే టీమిండియా ఎన్నో మరపురాని విజయాలను సొంతం చేసుకుంది. ఆటగాళ్లను ప్రోత్సహించడంలో కూడా ధోని ఎప్పుడూ ముందున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా, అశ్విన్, రైనా వంటి ఆటగాళ్లు ధోని సారథ్యంలోనే ఎక్కువగా షైన్ అయ్యారు.
అలాంటి ధోని 2019 వరల్డ్ కప్ ముగిసిన దగ్గరనుండి అందుబాటులో లేడు. వెస్టిండీస్ టూర్ కు అందుబాటులో ఉండనని చెప్పేసాడు. సౌతాఫ్రికా తో జరిగిన సిరీస్ లో ధోనిని ఎంపిక చేయలేదు. బాంగ్లాదేశ్ తో సిరీస్ లోనూ ధోని లేడు. రాబోయే వెస్టిండీస్ సిరీస్ లో కూడా ధోని ఉండట్లేదు.
ఈ నేపథ్యంలో ధోని భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కొంత మంది ధోని రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడని అన్నారు. కొంతమంది రాబోయే టి20 వరల్డ్ కప్ ఆడి కానీ రిటైర్ కాడని వ్యాఖ్యానించారు. తాజా సమాచారం ప్రకారం ధోనికి సన్నిహితంగా ఉండే ఒక సోర్స్ ద్వారా తెలిసింది ఏంటంటే ధోని 2021 తర్వాతే రిటైర్ అవ్వబోతున్నాడట.
ఈ మేరకు తన ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ మానేజ్మెంట్ కు కూడా సమాచారమందించాడట. వచ్చే ఐపీఎల్ లో బాగా పెర్ఫర్మ్ చేస్తే ఆటోమేటిక్ గా ధోని టి20 సెలెక్షన్స్ లో కన్సిడర్ అవుతాడు. అందుకనే టీమిండియాలో చోటు కోసం ధోని ఇప్పుడు ఎక్కువ ఆలోచించట్లేదని తెలుస్తోంది. 2021 లో ఐపీఎల్ భారీ వేలం జరుగుతుంది. ఆ వేలానికి తాను అందుబాటులోనే ఉంటానని ధోని చెప్పినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.
మరి ఇందులో నిజమెంతుందో తెలియదు. మరోవైపు ధోని గురించి అడిగితే సెలక్షన్ కమిటీ మేము మూవ్ ఆన్ అయిపోయాం అంటోంది. తిరిగి టోర్నీలు ఆడి ఫామ్ ను చాటుకోవాల్సిన బాధ్యత ధోనికి ఉందని సెలక్షన్ కమిటీ అభిప్రాయపడుతోంది.