ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని తెలిపింది. శనివారం సాయంత్రానికి బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
వాయుగుండం తుఫానుగా బలపడితే దీనికి ” రెమాల్” గా నామకరణం చేయనున్నారు. ఈ తుఫాను ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండకపోవచ్చని, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
రుతుపవనాల విస్తరణ ఈ అల్పపీడనంపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్ళొద్దని సూచించారు.