తెలుగు జాతి ఆత్మగౌరవం.. అంటూ తెలుగు ప్రజల నెత్తిన బలవంతంగా ఓ ప్రస్తావనను ఓ సామాజిక వర్గం.. ఓ రాజకీయ పార్టీ.. వీటికి అనుకూలంగా పని చేసే మీడియా రుద్దుతుంటాయి స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి.!
నో డౌట్.. స్వర్గీయ ఎన్టీయార్ అంటే విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు.. పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే, ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. రాజకీయాల్లోనూ ఎంతో పేరు ప్రఖ్యాతులూ సంపాదించుకున్నారాయన. స్వర్గీయ ఎన్టీయార్ ఎన్నో సంక్షేమ పథకాల్ని అమలు చేశారు. ఎన్టీయార్ నటించిన సినిమాలు ఎప్పటికీ, తెలుగు నేలపై సినీ అభిమానుల్ని అలరిస్తూనే వుంటాయి.
స్వర్గీయ ఎన్టీయార్ ప్రస్తావన లేకుండా, తెలుగునాట.. అందునా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రస్తావనలు కష్టం. ఆయన పేరు ప్రస్తావించకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడటమూ కష్టం.! ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. స్వర్గీయ ఎన్టీయార్ ఏ స్థాయిలో ఓ వెలుగు వెలిగారన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో, ఆయన పతనం కూడా అంతకన్నా దారుణమైనది.
కన్నబిడ్డలు వెన్నుపోటు పొడిచారు.. ఎవర్నయితే రాజకీయాల్లో ఆయన పైకి తెచ్చారో.. వారి చేతుల్లోనూ వెన్నుపోటుకి గురయ్యారు. స్వర్గీయ ఎన్టీయార్ జీవితంలో చివరి రోజులు అత్యంత బాధాకరంగా నడిచాయి. సింహం లాంటి వ్యక్తి.. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో తుదిశ్వాస విడిచారు.
రాజకీయంగా తనను వెన్నుపోటు పొడిచినవారి గురించి మీడియాతో చెప్పపుకుని కంటతడి పెట్టారు. కన్నబిడ్డలపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదిది. అయ్యిందేదో అయిపోయింది. కానీ, దాన్ని ప్రతిసారీ తవ్వుకుంటూ వెళుతున్నారు. ఈసారి వంతు లక్ష్మీపార్వతిది. కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల కాయిన్, స్వర్గీయ ఎన్టీయార్ బొమ్మతో తీసుకొస్తే, దాన్ని రాష్ట్రపతి విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని వాపోతున్న లక్ష్మీపార్వతి, తనను ఎన్టీయార్ పెళ్ళి చేసుకున్నారో లేదో చెప్పాలంటూ, ఎన్టీయార్ కుటుంబ సభ్యులకు సవాల్ విసిరారు. పెళ్ళి చేసుకోలేదన్నది నిజమైతే, తనను ఎన్టీయార్ మోసం చేసినట్లవుతుందనీ, అలాంటి వ్యక్తి యుగపురుషుడెలా అవుతారని ప్రశ్నిస్తున్నారు లక్ష్మీపార్వతి. ఇదెక్కడి పంచాయితీ.? చచ్చిన తర్వాత శవాన్ని కుళ్ళబోడిచేయడం.. అన్నమాట కూడా చిన్న విషయమే ఇక్కడ.
ఎన్టీయార్ చనిపోయి ఎన్నో ఏళ్ళు గడిచింది. ఇప్పుడాయన మీద స్వయానా ఆయన భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మీపార్వతి ఆరోపణలు చేయడం.!