సినీ నటి, వైసీపీ నేత, నగిరి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, మీడియా ముందు కంటతడి పెట్టారు. మహిళా మంత్రి మీద, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.!
కానీ, రాజకీయాల్లో నైతికత ఎక్కడ ఏడ్చిందిప్పుడు.? రోజా ఓ మహిళా మంత్రి. కాదని ఎవరు అనగలరు.? ఆమెకీ ఆత్మగౌరవం వుంటుంది. వుండదని ఎవరైనా అనగలరా.? కానీ, మహిళలందరికీ ఆత్మగౌరం వుంటుంది.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్కి కూడా ఆత్మగౌరవం వుంటుంది. ఇప్పుడు రేణు దేశాయ్ ప్రస్తావన ఎందుకు.? అంటే, 2009 ఎన్నికల సమయంలో, రేణు దేశాయ్ మీద అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యల్ని రోజా చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా వున్న వాసిరెడ్డి పద్మ అప్పట్లో ప్రజా రాజ్యం పార్టీ నేతగా వున్నారు. అప్పట్లో రోజా, టీడీపీలో వున్నారు. రేణు దేశాయ్ మీద రోజా చేసిన వ్యాఖ్యల్ని అప్పట్లో తీవ్రంగా ఆక్షేపించారు వాసిరెడ్డి పద్మ.
ఇప్పుడేమో, రోజా మీద బండారు సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సరికి, వెంటనే బండారు అరెస్టు దిశగా ఏపీ డీజీపీకి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ హోదాలో వాసిరెడ్డి పద్మ లేఖ రాసేశారు. లేఖ రాసే ముందు, ‘రోజా.. నువ్వు మాట్లాడింది కూడా తప్పు..’ అని వాసిరెడ్డి పద్మ ఎందుకు, తమ పార్టీ నాయకురాల్ని నిలదీయలేకపోయారు.?
‘డిక్కీ బలిసిన..’ అంటూ పదే పదే నారా లోకేష్ మీద విమర్శలు చేయడం.. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద అభ్యంతరకర వ్యాఖ్యల్ని చేయడం.. చివరికి చిరంజీవిని సైతం తూలనాడటం.. రాజకీయ ప్రత్యర్థులపై ‘పిల్ల పిత్రే.. వాడు.. వీడు..’ అంటూ విరుచుకుపడటం.. ఇదీ రోజా, రాజకీయాల్లో వాడుతున్న విపరీత పద ప్రయోగాలు.
తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నది వెనకటికి ఓ సామెత. రాజకీయాల్లోనూ అంతే మరి.! ఇట్నుంచి నాలుగు విమర్శలు వెళితే, అట్నుంచి నలభై నాలుగు విమర్శలు వచ్చిపడతాయి.
మంత్రి రోజాపై బండారు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు.. మంచిదే.! మరి, రోజా చేసిన విపరీత వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా.? ఆంధ్రప్రదేశ్ పోలీసులు, బాధ్యతల్ని విస్మరించి.. అధికార వైసీపీకి బానిసత్వం చేస్తున్నారన్న విమర్శలకు ఎందుకు అవకాశం దొరుకుతోంది.?
పోలీసు శాఖ ఈ విషయమై ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది. జనసేన మహిళా నేతలు కీర్తన, రాయపాటి అరుణ.. ఇలా చాలామందిపై వైసీపీ నేతలు అత్యంత అసభ్యకరమైన భాషని ఉపయోగిస్తున్నారు విమర్శలు చేసే క్రమంలో. నాగబాబు కుమార్తె నిహారిక మీద వైసీపీ చేస్తున్న జుగుప్సాకరమైన ప్రచారం అంతా ఇంతా కాదు. వీటికి చర్యలేవీ.?
ఆత్మగౌరవం అందరికీ వుంటుంది.! అరెస్టులు కూడా అదే పారదర్శకతతో జరిగి తీరాలి. తన పట్ల అసభ్యకరంగా రాజకీయ ప్రత్యర్థులు ప్రవర్తిస్తున్నారంటూ మీడియా ముందు కంటతడి పెట్టిన రోజా, నిజానికి.. తాను గతంలో చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతూ కంటతడి పెట్టి వుంటే బావుండేది.! కానీ, ఆమె నుంచి అలాంటి ‘ఆత్మ పరిశీలన’ని ఆశించలేం.