Pawan Kalyan: ‘శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నా కార్యకర్తపై పోలీసులు చేయి చేసుకున్నారు.. ఆ దెబ్బ నన్ను కొట్టినట్టే. శ్రీకాళహస్తి వచ్చి పోలీసులతోనే తేల్చుకుంటాను’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ చేశారు. ఇటీవల శ్రీకాళహస్తిలో నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్తల్లో ఒకరైన సాయిపై స్థానిక మహిళా సీఐ అంజు యాదవ్ చేయి చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సీఐ తీరుపై తాడేపల్లిగూడెంలో నాయకులు, కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘శాంతియుతంగా నిరసన చేయడం ప్రజాస్వామ్యంలో వ్యక్తికి ఉన్న హక్కు. తన హక్కును వ్యక్తం చేస్తున్న మా జనసైనికుడు సాయిపై అకారణంగా చెయ్యి చేసుకున్నారు. ఆ దెబ్బ నన్ను కొట్టినట్టే. ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోలేని కొందరు పోలీసులు శాంతి పంథాలో నిరసన తెలియజేస్తున్న వారిపై తమ జులుం చూపించడం హేయం. అక్కడికి వచ్చి తేల్చుకుంటాను’ అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.