Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నాళ్లుగా అన్నపూరణి సినిమా వివాదం కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా లో నయనతార బ్రాహ్మణ సామాజిక వర్గంకు చెందిన అమ్మాయిగా కనిపించింది. చెఫ్ అవ్వాలనే కోరికతో మాంసాహారం తినడంతో పాటు వండటం మొదలు పెడుతుంది.
బ్రహ్మణులను కించ పరిచే విధంగా సినిమా ఉందని వివాదం మొదలు అయింది. ఆ వివాదాల మధ్యే సినిమా థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. పాజిటివ్ టాక్ దక్కించుకున్న అన్నపూరణి సినిమాను ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ చేసింది. ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత మళ్లీ వివాదం మొదలు అవ్వడంతో సదరు ఓటీటీ సినిమా స్ట్రీమింగ్ నిలిపి వేసింది. సినిమాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
తాజాగా నయనతార ఈ విషయమై స్పందించింది. బ్రాహ్మణ సామాజిక వర్గంకు బహిరంగ క్షమాపణలు చెప్పింది. సదుద్దేశ్యంతో ఒక మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో అన్నపూరణి సినిమాను చేశాం. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. సెన్సార్ క్లియరెన్స్ వచ్చిన సినిమాను ఓటీటీ నుంచి తీసేస్తారని అనుకోలేదు.
మా సినిమా వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వారు అందరికి కూడా క్షమాపణలు చెబుతున్నాను. ఎవరిని కించపరచడం, ఎవరిని అవమాన పరచడం మా సినిమా ఉద్దేశ్యం కాదని నయనతార తన బహిరంగ లేఖలో పేర్కొంది. ఇంతటితో అయినా ఈ వివాదం ముగుస్తుందేమో చూడాలి.