Manjummel Boys: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) ఇటివల సూపర్ హిట్టయిన మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys) నిర్మాతకు లీగల్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తన అనుమతి తీసుకోకుండా తాను కంపోజ్ చేసిన గుణ సినిమాలోని పాటను సినిమాలో ఉపయోగించారని ఆయన ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం వార్తల్లో నిలిచింది.
దీనిపై మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాత షాన్ ఆంటోనీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ‘గుణ సినిమాలోని కణ్మని పాటను సినిమాలో అనుమతి లేకుండా ఉపయోగించలేదు. పాటలకు సంబంధించిన కాపీరైట్ కలిగిన రెండు మ్యూజిక్ కంపెనీలను సంప్రదించాం. వారి అనుమతి తీసుకున్న తర్వాతే సినిమాలో పాటను వాడా’మని అన్నారు.
‘పాటను కంపోజ్ చేసిన నాకే దానిపై మొదటి హక్కు ఉంటుంది. చిత్ర బృందం ఈ విషయంలో నన్నెప్పుడూ సంప్రదించలేదు. నా అనుమతి తీసుకోలేదు. నా పాటలకు సంబంధించి ప్రతి మ్యూజిక్ బిట్ పైనా నాకే రైట్స్ ఉంటాయ’ని అన్నారు. ఇటివల రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ కూలి సినిమా ట్రాక్ పై కూడా ఇళయరాజా నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.