తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడాన్ని, న్యాయ నిపుణులు చాలా లైట్ తీసుకుంటున్నారు. ఉరి శిక్ష పడేంత తీవ్రమైన నేరమైతే కాదిది.! పైగా, ఐటీ శాఖ వివరణ మాత్రమే కోరుతూ నోటీసులు జారీ చేసింది. అది కూడా, 118 కోట్లకు సంబంధించి.
రాజకీయాల్లో 118 కోట్లంటే చాలా చాలా చిన్న విషయం. హైద్రాబాద్లో ఇటీవల ఎకరం భూమి ధర 118 కోట్లు పలికింది. ఈ రోజుల్లో, ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంత కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్న పరిస్థితుల్నీ చూస్తున్నాం. అలాగని, 118 కోట్లంటే చిన్న విషయం కాదు.
118 కోట్లకు సంబంధించి చంద్రబాబు, వివరణ ఇచ్చేస్తే.. ఆ వివరణతో ఐటీ శాఖ సంతృప్తి చెందితే, ఇక ఈ విషయం గురించి మాట్లాడుకోవడానికీ ఏమీ వుండదు. అయితే, నోటీసులు ఇచ్చే అధికారం మీకు లేదంటూ ఐటీ శాఖకే చంద్రబాబు అల్టిమేటం జారీ చేయడం ఒకింత చిత్రంగా అనిపించకమానదు.
ప్రజా జీవితంలో వున్నప్పుడు.. అన్నిటికీ సమాధానం చెప్పాలి.! కానీ, చెప్పరు కదా.! తన మీద హత్యాయత్నం విశాఖలో జరిగితే, ఆ కోడి కత్తి కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం, కోర్టుకు హాజరు కావడంలేదు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అక్రమాస్తుల కేసులో, బెయిల్ మీదున్న వైఎస్ జగన్, కోర్టుకు విచారణ నిమిత్తం హాజరయ్యేందుకు నానా రకాల కుంటి సాకులూ చెబుతుండడం చూస్తున్నాం.
పైగా, వేల కోట్ల అక్రమాస్తుల కేసు అది.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పోల్చితే, చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన 118 కోట్ల వ్యవహారం చాలా చాలా చిన్నది. అయినా, చంద్రబాబు సమాధానం చెప్పి తీరాల్సిందే.
చంద్రబాబు అరెస్టు.. చంద్రబాబుకి జైలు శిఖ.. ఇలా వైసీపీ తీస్తున్న అర్థాలు చూస్తోంటే, ఫక్కున నవ్వొస్తుందెవరికైనా.! కొండను తవ్వి ఎలకని పట్టడం.. అంటారు కదా.! ఇది కూడా దాదాపు అలాంటిదే.! కాకపోతే, నాలుగున్నరేళ్ళు అధికారంలో వుండి కూడా చంద్రబాబు మీద ఇలాంటి ఒక్క కేసు పక్కగా పెట్టలేకపోయిన వైసీపీని ఏమనాలి.?