మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ హీరోగా విజేతతో పరిచయం అయ్యాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కాస్త గ్యాప్ తర్వాత సూపర్ మచ్చి సినిమాను కళ్యాణ్ దేవ్ చేశాడు. లాక్ డౌన్ కు ముందు ప్రారంభం అయిన సూపర్ మచ్చి ఇటీవలే పూర్తి చేశారు. థియేటర్ల పునః ప్రారంభం తర్వాత ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందట. సూపర్ మచ్చిని ముగించిన కళ్యాణ్ దేవ్ తన మూడవ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ఇప్పటికే రమణ తేజ దర్శక్వంలో ఈయన మూడవ సినిమా ప్రకటన వచ్చింది.
పవన్ కు ఆప్త మిత్రుడిగా పేరున్న రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందబోతుంది. అశ్వథామ సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న రమణ తేజ ఈ సినిమాతో మరో విభిన్న కాన్సెప్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అన్న్ సీతల్ ను ఎంపిక చేశారు. ఈ మలయాళి ముద్దుగుమ్మ అక్కడ చాలా సినిమాలు చేసి మెప్పించింది. మొదటి సారి తెలుగులో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సూపర్ మచ్చి విడుదలకు ముందే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాది ఒకటి రెండు నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈనెలాఖరు వరకు ఈ సినిమా టైటిల్ను కూడా రివీల్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్మాత రామ్ తాళ్లూరి పేర్కొన్నారు.