వైసీసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో వైసీపీ ముఖ్య నేతలకు తప్ప ఎవరికీ తెలియదు.
ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. సినీ ఫక్కీలో పోలీసులు రోడ్డు మీద ఛేజింగ్ చేసినా, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తప్పించుకు పారిపోవడం గమనార్హం. కారు డ్రైవర్, సహా మరో వ్యక్తి మాత్రం పోలీసులకు చిక్కారు. వారిని విచారించినా, సరైన సమాచారం వారి నుంచి దక్కలేదట.
‘నేనెక్కడికీ పారిపోలేదు’ అని వైసీపీ అను‘కుల’ మీడియాకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే ఆయన్ని పోలీసులు పట్టుకుని వుండాల్సింది. ఆయనేమీ సాదాసీదా వ్యక్తి కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. పైగా, సిట్టింగ్ ఎమ్మెల్యే.
ఇదిలా వుంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాటి పులిగా అభివర్ణిస్తోంది వైసీపీ. ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడిగా వున్న పిన్నెల్లి, ఎలా వైసీపీకి ‘పులి’లా కనిపిస్తున్నారో ఏమో.! బహుశా, తప్పించుకు తిరుగుతుండడం వల్ల ‘పిల్లి’ అనాల్సింది పోయి, ‘పులి’ అని అంటున్నారేమో.!
అరెస్టు తప్పదని తెలియడంతో, ముందస్తు బెయిల్ ఏర్పాట్లు చేసుకుంటున్నారట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. బెయిల్ దొరికితే, వెంటనే ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
ఈవీఎం ధ్వంసం చేయడానికి ముందు ఏం జరిగిందంటే.. అంటూ వైసీపీ దీర్ఘాలు తీస్తోన్న వైనం నవ్వులపాలవుతోంది. వైసీపీ ఆరోపిస్తున్నట్టు రిగ్గింగ్ నిజంగానే జరిగినా, ఈవీఎంని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టి వుండకూడదు. నేరం జరిగింది.. దోషి ఎవరనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక, శిక్ష పడటమే తరువాయి.