గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి బోల్డంత క్యాడర్ వుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకుంటే, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 30 నుంచి 35 శాతం వరకు జనసేన పార్టీకి ఈసారి ఓటు బ్యాంకు రావొచ్చంటూ పలు సర్వేల్లోనూ తేలుతోన్న పరిస్థితి.
వారాహి విజయ యాత్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదలు పట్టడానికి కారణం కూడా ఇదే. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ‘వారాహి విజయ యాత్ర’ అంచనాలకు మించి విజయవంతమైన దరిమిలా, తదుపరి విశాఖ జిల్లాను ఎంచుకున్నారు జనసేనాని, ‘వారాహి విజయ యాత్ర’ కోసం.
విశాఖలో అడుగు పెడుతూనే, వారాహి విజయ యాత్రకు అనూహ్యమైన రీతిలో ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. గతంలో విశాఖలో జనసేనానికి వైసీపీ సర్కారు కల్పించిన ఆటంకాలు, తదనంతర పరిణమాల నేపథ్యంలో జనసేన కూడా విశాఖలో వారాహి యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
రోజు రోజుకీ వారాహి విజయ యాత్రకు జనం నుంచి వస్తున్న సానుకూల స్పందన మరింత పెరుగుతోంది. స్థానికంగా వైసీపీ పట్ల తీవ్రంగా వున్న వ్యతిరేకత మాత్రమే కాదు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ వీక్గా వుండటం జనసేనకు కలిసొస్తున్న అంశం.
గడచిన నాలుగేళ్ళలో విశాఖలో వైసీపీ అరాచకాల్ని స్థానిక ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయా అంశాల్ని జనసేన అధినేత విపులంగా ప్రస్తావిస్తుండడంతో, అధికార వైసీపీకి వెన్నులో వణుకు పుడుతోంది. కాస్త కష్టంగా వున్నా, అంకెలతో సహా, అధికార పార్టీ అరాచకాల్ని జనసేనాని ‘వారాహి విజయ యాత్రలో’ ప్రస్తావిస్తున్న వైనం. విశాఖ ప్రజల్ని ఆకట్టుకుంటోంది.
పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, సాధారణ ప్రజానీకం కూడా.. వీకెండ్ ఎంటర్టైన్మెంట్ అయిన సినిమాల్ని లైట్ తీసుకుని, పూర్తిగా రాజకీయాల గురించి.. అదీ వారాహి విజయ యాత్రపై ఫోకస్ పెట్టడం గమనార్హం. ఇదంతా చూస్తోంటే, వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో సమానంగా, అంతకు మించిన రీతిలో సానుకూల ఫలితాలు జనసేనకు విశాఖలో వచ్చేలా వున్నాయ్.. అనే భావన రాజకీయ విశ్లేషకుల్లోనూ వ్యక్తమవుతోంది.