ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. నామినేష్ల ప్రక్రియ ముగిసింది. ఉపసంహరణల పర్వం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధిష్ఠానం ఎక్కడికక్కడ నష్టం కలిగిస్తారనుకుంటున్న వారిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది.. కళ్యాణదుర్గంలో టీడీపీ సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసారు.. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి తాను టీడీపీలోనే ఉన్నానని, అలాంటిది ఇప్పుడు తనను కాదని మరొకరికి టికెట్ ఇవ్వడమేమిటని ఆయన ప్రశిస్తున్నారు.
దీన్ని వ్యతిరేకిస్తూ తాను బరిలో ఉంటానని.. ఆయన అమరావతిలో చంద్రబాబుతోనే చెప్పి మరీ వచ్చారు. అదే ప్రకారం ఆయన తన అనుచరగణంతో అట్టహాసంగా స్వతంత్ర అభ్యర్థిగా కళ్యాణదుర్గంలో నామినేషన్ దాఖలు చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ టికెట్ దక్కించుకున్న ఉమామహేశ్వరనాయుడు ఉన్నంను కలిసి తన విజయం కోసం సహకరించాలని కోరారు.. అయినా ఆయన పట్టు వీడకుండా తాను పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు.
జిల్లా నాయకులు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో హనుమంతరాయ చౌదరితో సీఎం మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ హనుమంతరాయచౌదరికి టీడీపీ జిల్లా ఎన్నికల బాధ్యతలు, ఆ తరువాత పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలతోపాటు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేలా హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో కళ్యాణదుర్గం టీడీపీకి కొంత అసమ్మతి సెగ తగ్గినట్టేననే అభిప్రాయాలున్నాయి.
జేసీ చొరవతో దారిలోకి గుంతకల్లు గుప్తా
ఎంపీ జేసీ దివాకర్రెడ్డి చొరవతో సీఎం చంద్రబాబు మాట్లాడిన తరువాత గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా దారిలోకి వచ్చినట్టు చర్చ జరుగుతోంది. జేసీ డిమాండు మేరకు గుప్తాకు టీడీపీ టికెట్ ఇవ్వలేదనే కారణంతో ఆయనను జనసేనలో చేర్పించారనే ప్రచారం జరిగింది. ఇదే విషయం జేసీతో సీఎం చంద్రబాబు ప్రస్తావించినట్టు సమాచారం.
దీంతో మళ్లీ మధుసూదన్ గుప్తా జనసేన నుంచి వేసిన నామినేషన్ వెనక్కు తీసుకునేలా ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ టీడీపీ అభ్యర్థి జితేంద్రగౌడ్ విజయం కోసం కృషిచేసిన అనంతరం గుప్తాకు రాజకీయంగా మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పినట్టు సమాచారం. దీంతో గుంతకల్లు టీడీపీ అభ్యర్థికి కూడా అసంతృప్తుల పోటు తప్పినట్టేననిపిస్తోంది.
ఇటీవలే రాయదుర్గంలో టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఎమ్మెల్సీ దీపక్రెడ్డిని ఎంపీ జేసీ దివాకర్రెడ్డి దారిలోకి తెచ్చిన విషయం తెలిసిందే. అనంతపురంలోని ఎంపీ నివాసంలో కాలవ శ్రీనివాసులును, దీపక్రెడ్డిని ఒక చోట కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చారు. వారిద్దరి మధ్య గల చిన్నచిన్న పొరపొచ్చాలు తొలగించారు.
దీంతో అక్కడ కాలవ శ్రీనివాసులు విజయానికి దీపక్రెడ్డి కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇక కదిరిలో ఎంపీ నిమ్మల కిష్టప్ప చొరవతో ఎమ్మెల్యే చాంద్బాషాను కలిసి..తన విజయానికి సహకరించాలని టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కోరిన విషయం విదితమే. అప్పటికేమో పరిస్థితులు చక్కబడినట్టు కనిపించినా ఆ తరువాత వారిద్దరి మధ్య సంబంధాలు అంతగా మెరుగుపడలేదనే అభిప్రాయాలున్నాయి.
శింగనమలలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీబాల అక్కడి అభ్యర్థి బండారు శ్రావణి ప్రచారానికి అంతగా కలిసి రావడం లేదని తెలుస్తోంది. శ్రావణి మాత్రం గత ఎన్నికల్లో తాము యామినీబాల విజయం కోసం పనిచేశామని, ఇప్పుడు తన విజయానికి ఆమె కచ్చితంగా పనిచేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్ చౌదరి విజయానికి కృషి చేయడానికి కలిసి రాకుండా కొందరు అసంతృప్తులు దూరంగా ఉంటున్నారు. పోటీలో ఉన్న చౌదరి వారిని కులుపుని పోయే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. కానీ వారు అందుబాటులో లేరని తెలిసింది. వారంతా టీడీపీకి విధేయులే కాబట్టి తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారనే నమ్మకాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.
92621 648598Numerous thanks for sharing this fine piece. Quite fascinating tips! (as always, btw) 768085
902784 839661I likewise believe thus, perfectly pent post! . 665437