బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలోని తన నివాసం వద్ద పోలీసులు ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు. సీజన్-7 ఫైనల్ అనంతరం జూబ్లీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన అల్లర్ల కేసులో ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడు పై 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రశాంత్ తో పాటు అతడి తమ్ముడు మహావీర్ ను అరెస్టు చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ స్టేషన్ కి తరలించారు.
కేసు నేపథ్యమిది
బిగ్ బాస్ ఫైనల్స్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. పల్లవి ప్రశాంత్ ని విజేతగా ప్రకటించిన తర్వాత అమర్ దీప్, ప్రశాంత్ అభిమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అమర్ కారుపై కొందరు దాడి చేశారు. మరో కంటెస్టెంట్ అశ్విని కారు పైన దాడి చేశారు. బందోబస్తు నిమిత్తం అక్కడికి వచ్చిన ఏసీపీ వాహనం, ఆర్టీసీ బస్సు పై రాళ్లు విసరడంతో అవి పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడికి పల్లవి ప్రశాంత్ కారణమని పోలీసులు తేల్చారు. దీంతో అతన్ని A1 గా, అతడి సోదరుడు మహావీర్ ని A2 గా, అతని స్నేహితుడు వినయ్ ని A3 గా చేర్చారు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారని వార్తలు రాగా.. తాను ఇంట్లోనే ఉన్నానంటూ ప్రశాంత్ వీడియో రిలీజ్ చేశారు. దీంతో పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.