టీడీపీ – జనసేన – బీజేపీ.. ఈ మూడు పార్టీల కూటమిలో అత్యధికంగా లాభపడుతున్న పార్టీ ఏదన్నా వుందంటే, అది బీజేపీనే.! ఏకంగా ఆరు ఎంపీ టిక్కెట్లు బీజేపీకి దక్కుతున్నాయి, పొత్తుల్లో భాగంగా. పది అసెంబ్లీ టిక్కెట్లు కూడా ఆ పార్టీకి దక్కనున్నాయి.
వన్ సైడ్ వేవ్ గనుక కూటమికి వుంటే, బీజేపీ పంట పండినట్టే. లేని పక్షంలో, బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాలన్నీ వైసీపీకి అప్పనంగా ఇచ్చేసినట్లవుతుందనే వాదన రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.
ఇదిలా వుంటే, తమకు దక్కిన ఆరు టిక్కెట్లలో ఎవర్ని నిలబెట్టాలన్నదానిపై ఏపీ బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. టీడీపీ నుంచి బీజేపీలోకి దూకిన నేతలకే ఎక్కువ టిక్కెట్లు దక్కే అవకాశాలున్నాయన్నది సుస్పష్టం. దాన్ని బీజేపీలో కొందరు నేతలు అస్సలు ఒప్పుకోవడంలేదు.
బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కాకుండా, బీజేపీతోనే చాలాకాలంగా వున్న నాయకుల్లో ఎవరికీ లోక్ సభ అభ్యర్థులుగా నిలబడి, గెలిచేంత సీన్ లేదు. అసెంబ్లీ సీట్ల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. కానీ, పొత్తు ధర్మం.. బీజేపీకి టిక్కెట్లు కేటాయించక తప్పలేదు టీడీపీ, జనసేన పార్టీలకి.
సైలెంటుగా అంతర్గత వ్యవహారాలు చక్కబెట్టుకోకుండా, ఏపీ బీజేపీ నేతలు రచ్చకెక్కుతుండడంతో, అది అధికార వైసీపీకి అడ్వాంటేజ్ అవుతోంది. ఈ క్రమంలో బీజేపీ తమకు కేటాయించిన సీట్లను కూటమిలోని టీడీపీకో, బీజేపీకో కొన్ని వదిలేసుకోవడమే బెటర్.. అని బీజేపీలో ఇంకో చర్చ కూడా షురూ అవుతోందిట.
ఔను మరి, ఏపీలో రాజకీయం చాలా చాలా ఖరీదైపోయింది. అసెంబ్లీ నియోజకవర్గమైనా, లోక్ సభ నియోజకవర్గమైనా.. 50 కోట్లకు పైనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మరి, బీజేపీలో అంత రిస్క్ చేయగల నిజమైన బీజేపీ నాయకులు ఎవరున్నారబ్బా.?