తెలుగు పాత్రికేయ రంగానికి రామోజీరావు చేసిన ‘సేవ’ ఏంటి.? అన్నదానిపై, ఆనాటి పాత్రికేయులు.. ఈనాటి పాత్రికేయులు.. ఎవర్ని అడిగినా, పెద్ద పెద్ద ఉపన్యాసాలే దంచేస్తారు. ఈనాడులో పనిచేసినోళ్ళూ.. గట్టిగానే చెబుతారు.
ఏ కోణంలో చెబుతారు.? అంటే, తమకు ఎదురైన వేధింపుల వ్యవహారాల గురించి.. అన్నది నిర్వివాదాంశం. నిజమే, తెలుగు పాత్రికేయం.. అన్న ప్రస్తావన వస్తే, ముందుగా ‘ఈనాడు’ గురించే మాట్లాడుకోవాలి.
కానీ, ‘ఈనాడు’ కూడా ఓ వ్యాపారమే.! రామోజీరావు పాత్రికేయం ముసుగులో చేసింది వ్యాపారం కాదు, సమాజ సేవ.. అని ఎవరైనా చెప్పగలరా.? కుల జాడ్యం దగ్గర్నుంచి, చాలా చాలా వుంటాయక్కడ.. అనేవారు చాలామందే వుంటారు.!
కోవిడ్ కష్టకాలంలో ఉద్యోగుల్ని ఈనాడు సంస్థ ఎలా వేధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఉద్యోగం మానేసి, వేరే చోటకు వెళ్ళాలంటే.. అలాంటోళ్ళకి ఈనాడు నరకం చూపించేస్తుందనే బలమైన అభిప్రాయం మీడియా వర్గాల్లో వుంది.
సరే, మీడియా సంగతి పక్కన పెట్టేద్దాం. మార్గదర్శి సంగతేంటి.? మార్గదర్శి ముసుగులో రామోజీరావు చేసిన అక్రమాల మాటేమిటి.? ఎంపీగా వున్న సమయంలో వుండవల్లి అరుణ్ కుమార్ మొదలు పెట్టిన పోరాటం.. ఇంకా ఇంకా కొనసాగుతూనే వుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగేసరికి.. విషయం ముదిరి పాకాన పడింది.
రాజకీయాల్ని సైతం శాసించగల స్థాయిలో వున్న రామోజీ, సీఐడీ విచారణను ఎదుర్కొంటున్నారిప్పుడు. దాంతో, తమ రాజగురువుకి వచ్చిన కష్టాన్ని జీర్ణించుకోలేకపోతోంది తెలుగుదేశం పార్టీ. ‘తెలుగు ప్రజలంతా రామోజీరావుతోనే..’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ప్రచారంలోకి తెచ్చింది టీడీపీ.
అంతేనా, రామోజీరావుని.. తెలుగు జర్నలిజం పితామహుడనీ పేర్కొంటోంది. అబ్బో, రామోజీ ఘనతల గురించి టీడీపీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారంతో, మామూలుగా అయితే ఆయన మీద సింపతీ క్రియేట్ అవ్వాలి. కానీ, మరింత వెగటు పుడుతోందని.. నెటిజనం తిట్టిపోస్తున్నారు.