తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ నేపథ్యంలో అధికార వైసీపీ అను‘కుల’ మీడియా పైత్యం ప్రదర్శించడంలో వింతేమీ లేదు.! జనసేన అధినేత మీద ‘జాలి’ చూపిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి వైసీపీ అను‘కుల’ మీడియాలోని కథనాలు.
మరోపక్క, టీడీపీ అను‘కుల’ మీడియా కథనాలు ఇంకాస్త భిన్నంగా వున్నాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఇస్తున్న జోష్, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ నేపథ్యంలో టీడీపీ కొత్త ఉత్సాహంతో వుందనీ, దాంతో ఎక్కడ పొత్తు కుదరదోనని పవన్ కళ్యాణ్ కంగారుపడి, టీడీపీ అధినేత ఇంటికి వెళ్ళారన్నది టీడీపీ అను‘కుల’ మీడియాలో కనిపిస్తున్న వార్తా కథనాల సారాంశం.
అసలంటూ చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ వెనుక కారణమేంటో జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ స్పష్టంగా చెప్పేశారు. ‘వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంలో భాగంగానే’ అంటూ నాదెండ్ల మనోహర్ చెప్పాక, ఈ పచ్చ లొల్లి ఏంటి.?
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది జనసేనాని ఆలోచన. నిజానికి, జనసేన పార్టీతో పొత్తు కోసం మొదటి నుంచీ వెంపర్లాడుతున్నది తెలుగుదేశం పార్టీనే. ‘ఎప్పుడూ మేమే త్యాగాలు చేయాలంటే ఎలా.? ఈసారికి మీరు త్యాగాలు చెయ్యండి..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పరోక్షంగా టీడీపీకి తాను చెప్పాల్సింది చెప్పేశారు కొన్నాళ్ళ క్రితం.
పొత్తుల ఆలోచనతో తొలుత పవన్ కళ్యాణ్ని చంద్రబాబే కలిశారు. జనసేన మీదకు వలపు బాణాలు విసిరింది కూడా చంద్రబాబే.! తమది వన్ సైడ్ లవ్ అని చంద్రబాబే చెప్పుకున్నారు కూడా.! అలాంటప్పుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు వెంపర్లాడతారు చంద్రబాబు ప్రాపకం కోసం.? ఇంకోసారి టీడీపీని మట్టికరిపించేందుకు టీడీపీ అను‘కుల’ మీడియా కంకణం కట్టుకున్నట్టే వుంది. లేకపోతే, జనసేన మీద టీడీపీ అను‘కుల’ మీడియా విష ప్రచారం దేనికి సంకేతం.?