Vangaveeti Radha: దివంగత నేత వంగవీటి రంగా (Vangaveeti Ranga) కుమారుడు, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha) త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. ఆయన నిశ్చితార్థం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన జక్కం పుష్పవల్లితో ఆదివారం నిరాడంబరంగా జరిగింది. ఏలూరు మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల చిన్న కుమార్తె పుష్పవల్లి.
ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన ముఖ్యమైన బంధువులను మాత్రమే ఆహ్వానించారు. వీరితోపాటు నరసాపురం ప్రాంతానికి చెందిన ముఖ్యమైన వివిధ పార్టీల రాజకీయ నాయకులను ఆహ్వానించారు. నిశ్చితార్ధానికి హాజరైన ప్రముఖులలో ప్రభుత్వ చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ నరసాపురం ఇంచార్జి బొమ్మిడి నాయకర్ మరికొంతమంది నాయకులు హాజరయ్యారు.
వంగవీటి రాధా, పుష్పవల్లిల వివాహం అక్టోబరులో జరుగబోతోంది. అక్టోబర్ 22 సాయంత్రం 7.59 గంటలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. కాగా, రాధా ఓ ఇంటివాడు కానుండడంతో వంగవీటి అభిమానులు సంతోషిస్తున్నారు.