చంద్రబాబు హయాంలో అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అదేనండీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రపతికి పలు మార్లు పలు విషయాలపై ఫిర్యాదు చేసింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివన్నీ మామూలే. అప్పుడు వైసీపీ చేసిన పనే, ఇప్పుడు టీడీపీ చేసింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం, ఇటు మీడియాని.. అటు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్నీ అవహేళన చేస్తోందన్న విమర్శలు రోజురోజుకీ పెరిగిపోతున్న దరిమిలా, రాష్ట్రపతికి టీడీపీ చేసిన ఫిర్యాదు ఒకింత కలకలం రేపుతున్న మాట వాస్తవం.
‘హత్యా రాజకీయాలు నడుస్తున్నాయి.. విపక్షాలపై కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయి.. మీడియాపైనా దాడులు జరుగుతున్నాయి.. రాజ్యాంగ వ్యవస్థల్నీ వదిలిపెట్టడంలేదు..’ ఇలా పలు అంశాల్ని రాష్ట్రపతికి నివేదించింది టీడీపీ నేతల బృందం. అసలు రాష్ట్రంలో ‘శాంతి భద్రతలు’ అనేవే లేవన్నది టీడీపీ ఆరోపణ.
ఇదిలా వుంటే, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్, సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం రాష్ట్రపతికి వుందా..’ అని ప్రశ్నిస్తోంటే, దానికి సమాధానమిస్తూ.. దానికి ఓ పద్ధతి వుంటుందనీ, పరిస్థితులపై రాష్ట్రపతికి రాజకీయ పక్షాలు ఫిర్యాదు చేయాల్సి వుంటుందని అన్నారు. అందుకు తగ్గట్టే టీడీపీ, ఇప్పుడు రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. అలాగని, రాష్ట్రపతి రాత్రికి రాత్రే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసేస్తారని అనలేం.
కానీ, ఇటీవల బీజేపీ నేత ఒకరిపై రాష్ట్రంలో హత్యాయత్నం జరిగింది. ఆ దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలు కావడం గమనార్హం. అదృష్టవశాత్తూ సదరు బీజేపీ నేత ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. బీజేపీ అధిష్టానం కూడా రాష్ట్రంలో పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ‘కేంద్రంలో అధికారంలో వున్నది మేమేనన్న విషయాన్ని మర్చిపోవద్దు..’ అని ఏపీ బీజేపీ నేతలు, రాష్ట్రంలోని అధికార వైసీపీకి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.
ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఏకంగా హైకోర్టు మీదనే వైసీపీ మద్దతుదారులు, వైసీపీ నేతలు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాల్ని చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కేంద్రం, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోక తప్పేలా లేదేమో.! ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు చంద్రబాబుకి అన్ని విషయాలూ తెలుస్తుంటాయి. అలా ఏదో ‘ఉప్పందబట్టే’ టీడీపీ బృందాన్ని రాష్ట్రపతి వద్దకు పంపిన టీడీపీ అధినేత చంద్రబాబు, రాజకీయంగా తనదైన స్టయిల్లో కీలకమైన ‘ట్విస్ట్’ ఇచ్చారా.? అసలేం జరుగుతోంది ఢిల్లీలో.! కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ‘కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి..’ అని కొన్నాళ్ళుగా బీజేపీ నేతలు చెబుతున్న విషయాల్లో వాస్తవమెంత.? వేచి చూడాల్సిందే.
259018 601822I enjoy the beneficial information you give within your articles. 875424