సంక్రాంతి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందాలు, కొత్త అల్లుళ్ళ సందడే కాదు.. ఈసారి రాజకీయ సందడి కూడా.! త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు, లోక్ సభ ఎన్నికలు జరగనున్న దరిమిలా, ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ఎక్కడికక్కడ బల ప్రదర్శన చేశారు.
తాగినోడికి తాగినంత పోశారు. తిన్నోడికి తిన్నంత నాన్ వెజ్ కూడా పెట్టారు.! అంతేనా, పండగ ఖర్చులంటూ కొత్త అల్లుళ్ళను మేపినట్టు మేపారు కొన్ని చోట్ల రాజకీయ నాయకులు, తమ అనుచరుల్ని.
‘ఎన్నికలు ఇప్పుడే జరుగుతున్నట్టుంది పరిస్థితి..’ అంటూ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలకు హాజరైన కొందరు అక్కడి పరిస్థితుల్ని చూసి ఆశ్చర్యపోయారు.
కోడి పందాల బరులు మామూలే.. కోట్లలో చేతులు మారడమూ మామూలే. కోడి పందాల నేపథ్యంలో గెలిచిన, ఓడిన కోళ్ళ తాలూకు మాంసం విక్రయాలు షరామామూలుగానే రికార్డు ధరలు పలికాయి. రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు గతంతో పోల్చితే, ఈసారి చాలా చాలా ఎక్కువగా కనిపించాయి.
ఆసక్తికరమైన విషయమేంటంటే, ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ఒక్క తాటిపైకి వచ్చి కోడి పందాల్ని విజయవంతంగా నిర్వహించడం. ఆ తర్వాత షరామామూలుగానే రాజకీయ నాయకుల మధ్య గొడవలు జరుగుతున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
‘ఎవ్వరికీ ఎలాంటి లోటూ రాకూడదు.. ఖర్చు ఎంతైనా ఫర్లేదు..’ అంటూ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజా ప్రతినిథులు, టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ‘ఈసారి గోదారి జిల్లాలు జనసేన ఖాతాలోనేనట కదా..’ అన్న మాట ఎక్కువగా వినిపించింది.
‘వైసీపీకి ఓటేస్తే మట్టే..’ అంటే అనే స్లోగన్స్ చాలా చాలా ఎక్కువగా వినిపించాయి. ‘జనసేనని బాగా చూసుకుంటేనే, టీడీపీ భవిష్యత్తు..’ అనే నినాదాలూ ఎక్కువగా కనిపించాయి, వినిపించాయి కూడా.! ఇదీ ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం.! ఆ చివర్నించి ఈ చివరదాకా.. అంటే, ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. అంతటా దాదాపు ఇదే పరిస్థితి.