నరేంద్ర మోడీ సర్కారు చేసిన మరో ఆలోచన బెడిసికొడుతోంది. దేశవ్యాప్తంగా అల్లర్లకు కారణమవుతోంది. మొన్న రైతులు.. ఇప్పుడేమో, నిరుద్యోగులు.! రైతు చట్టాలు ఎలాగైతే వెనక్కి తీసుకున్నారో, సైనిక విభాగంలో నియామకాలకు సంబంధించి ‘అగ్నిపథ్’ విధానంపై నిరుద్యోగ యువత భగ్గుమంటోంది. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన యువజన విభాగాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి.
నిన్నటిదాకా ఉత్తర భారతదేశానికే పరిమితమైన ఆందోళనలు, తెలుగు రాష్ట్రాలకీ పాకాయి. తెలంగాణలో.. అందునా విశ్వనగరం హైద్రాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ చోటు చేసుకోనంత దారుణమైన పరిస్థితులు వచ్చాయిప్పుడు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారులు విధ్వంసాలకు తెగబడ్డారు. పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ క్రమంలో మూడు రైళ్ళు తగలబడినట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలు కాగా, కొందరు మృత్యువాత పడినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, ఇక్కడ ఓ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఏం తగలబెడుతున్నారు.? ఎందుకు తగలబెడుతున్నారు.? తగలబెట్టడం వల్ల ఒరిగేదేంటి.? ఎవరికి లాభం.? ఎవరికి నష్టం.? అన్న ప్రశ్నలకు ఆందోళనకారులు సమాధానం చెప్పాల్సి వుంటుంది. కాదు కాదు, చెప్పుకోవాల్సి వుంటుంది.
రైలు తగలబడితే, కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీకి నష్టం కాదు. దేశానికి నష్టం. దేశానికి నష్టమంటే, దేశంలోని ప్రతి పౌరుడికీ నష్టం. దేశ పౌరులంతా చెమటోడ్చి కష్టపడి సంపాదించిన సొమ్ము, పన్నుల రూపంలో ప్రభుత్వాలకు కడితే, అలా ప్రభుత్వ ఖజానా నిండితే.. దాన్నుంచే వివిధ వ్యవస్థలు ఏర్పాటవుతాయి.. ఆయా వ్యవస్థలు నిర్వహించబడతాయి.
నిరసనలకూ ఓ హద్దూ అదుపూ వుండాలి. అసాంఘీక శక్తులు రంగంలోకి దిగినప్పుడే ఇలాంటి విధ్వంసాలు చోటు చేసుకుంటాయి. ఇంత జరుగుతున్నా, కేంద్రం ఎందుకు మెట్టు దిగడంలేదు.? మంట రాజేసి, చలికాచుకోవడంలో అర్థమేంటి.?
778624 319565I appreciate your work , thanks for all the informative weblog posts. 292163