దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు సాక్షీభూతంగా నిలిచిన అత్యంత దారుణ ఘటనల్లో ఒకటి ‘దిశ’ అత్యాచారం, హత్య. పాశవికమైన ఈ దారుణకాండకు నేటితో ఏడాది పూర్తైంది. నవంబర్ 27న శంషాబాద్ లోని ఇంటి నుంచి గచ్చిబౌలి వెళ్తున్న ‘దిశ’ అదేరోజు రాత్రి దారుణమైన అత్యాచారానికి, ఆపై హత్యకు గురైంది. ఈ ఘటనకు కారకులైన నలుగురు నిందితులు డిసెంబర్ 6న పోలీసు విచారణ నుంచి తప్పించుకునే క్రమంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఈ రెండు ఘటనలు తీవ్ర సంచలనం రేపాయి.
ఈ ఎన్ కౌంటర్ పై డిసెంబర్ 12న సుప్రీంకోర్టు విచారణ కమిటీని వేసింది. అయితే.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు త్రిసభ్య కమీషన్ ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 3న ప్రారంభమైన విచారణలో నిందితులు.. మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివల కుటుంబసభ్యులు, ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను విచారించింది. మార్చి 23,24 తేదీల్లో మలి విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా, లాక్ డౌన్ పరిస్థులతో సాధ్యం కాలేదు.
ఈ పరిస్థితుల్లో ప్రజల నుంచి ఆన్ లైన్, లేఖల ద్వారా అఫిడవిట్లు దాఖలు చేయాలని కోరింది. ఈమేరకు వచ్చిన 1365 అఫిడవిట్లలో ఎక్కువగా తెలుగులోనే వచ్చాయి. దీంతో వీటిని ఇంగ్లీషులోకి తర్జుమా చేసేందుకు సమయం కోరడంతో సుప్రీంకోర్టు ఈ ఏడాది జూలైలో మరో ఆరు నెలల గడువు పెంచింది. దీంతో ఘటన జరిగి దాదాపు ఏడాదైనా విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. ఘటన తర్వాత ఏపీలో దిశ చట్టం, పోలీస్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. దిశ చట్టంపై కేంద్రం నుంచి ఆమోదం రావాల్సి ఉంది.