తెలుగు మీడియంలో చదవాల్సి వస్తే అది అంటరానితనమా.? ఇంగ్లీషు మీడియంలో చదివితే గొప్పా.? అసలేం జరుగుతోంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, తెలుగు మీడియంకి పాతరేసి, ఇంగ్లీషు మీడియంకి విపరీతమైన ప్రచారం కల్పిస్తుండడం చూస్తున్నాం.!
నిజమే, రిక్షా కార్మికుడు సైతం తన పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించాలనుకుంటున్నాడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, ‘కేవలం పేదలు, వెనుకబడిన వర్గాలు మాత్రమే తెలుగు మీడియంలో చదవాలా.? పేద పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవకూడదా.?’ అన్న వాదన సరైంది కాదు.!
ఇక్కడ ఎవరూ ఇంగ్లీషు మీడియంకి వ్యతిరేకం కాదని ఎవరెంతలా నెత్తీ నోరూ బాదుకుంటున్నా, ‘అదిగో వాళ్ళంతా పెత్తందార్లు, వాళ్ళే ఇంగ్లీషు మీడియంని వ్యతిరేకిస్తున్నారు..’ అన్నది వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చేస్తున్న ఆరోపణ.
ఓ పద్ధతి ప్రకారం దుష్ప్రచారం కొనసాగిస్తే, ఒప్పు తప్పయిపోతుందనీ.. తప్పు ఒప్పయిపోతుందనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
జపాన్లో అక్కడి స్థానిక భాషకే ఎక్కువ విలువనిస్తారు. చైనాలో సంగతి తెలిసిందే. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా, మాతృ భాషకి ప్రాధాన్యత ఎక్కువ. మాతృ భాషలో ప్రావీణ్యం అవసరం.. ఆ తర్వాత, యూనివర్సల్ లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం సైతం, మాతృభాషలో విద్యా బోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ పరిస్థితుల్లో, తెలుగు మీడియంలో చదవడమంటే, అదేదో అంటరానితనం.. అన్నట్లు ప్రతిసారీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారిక వేదికలపై దుష్ప్రచారం చేయడం అత్యంత హాస్యాస్పదం.
ఇంగ్లీషు భాష మీద ప్రేమతో, తెలుగు భాషని అంటరాని భాషగా మార్చేయడం పాలకులకు తగదు.!