తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.! త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దరిమిలా, తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా తెలంగాణకు వచ్చారు.
ఈ క్రమంలో, తెలంగాణ ప్రభుత్వంపైనా, బీఆర్ఎస్ అధినేత కేసీయార్పైనా మోడీ ఘాటైన ఆరోపణలు చేశారు. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందన్నారు. ఎన్డీయేలో చేరేందుకు కేసీయార్ ప్రయత్నించినా, తాము తిరస్కరించినట్లు మోడీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందన్నారు.
కేసీయార్ తన కుమారుడికి పగ్గాలు అప్పగిస్తానని చెప్పారనీ, ఇదేమీ కుటుంబ స్వామ్యం కాదు.. ప్రజాస్వామ్యమని చెప్పి పంపించేసినట్లు నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం గమనార్హం. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి వున్నామనీ, పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ.. ఇవన్నీ తెలంగాణ ప్రజల మీద ప్రేమతో చేసినవేనని మోడీ చెప్పుకొచ్చారు.
కాగా, నరేంద్ర మోడీ విమర్శలపై తెలంగాణ మంత్రి కేటీయార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పిచ్చి మాటలతో తెలంగాణ ప్రజల్ని వంచించడం మోడీకి తగదని కేటీయార్ వ్యాఖ్యానించారు. ‘అసలు ఎన్డీయేలో ఎవరున్నారు.? టీడీపీ వదిలేసింది.. మిగతా పార్టీలూ వదిలేశాయి. అలాంటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో మేమెందుకు చేరతాం.?’ అని ప్రశ్నించారు కేటీయార్.
‘కేసీయార్ ఫైటర్.. చీటర్ లాంటి బీజేపీతో కలిసి పనిచేసే అవకాశమే లేదు..’ అని కేటీయార్ తేల్చి చెప్పారు. తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది గులాబీ పార్టీయేనని, కాంగ్రెస్ అలాగే బీజేపీలకు తెలంగాణలో చోటు లేదని కేటీయార్ కుండబద్దలుగొట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదనీ, ఐటీ పరిశ్రమ అభివృద్ధికీ సహకరించలేదనీ, రైల్వే ప్రాజెక్టుల విషయంలోనూ కేంద్రం, రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వడంలేదని కేటీయార్ మండిపడ్డారు.