ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు రాజ్ ఈరోజు హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఆయన స్వగృహంతో తుదిశ్వాస విడిచారు. రాజ్-కోటి ద్వయం 1980-90 దశకాల్లో విజయవంతమైన సంగీత దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతమైన పాటలను ట్యూన్ చేశారు. వీరిద్దరూ కలిసి 100కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.
అయితే.. 1994లో ఈ ద్వయం విడిపోయి.. వేర్వేరుగా సంగీతం అందించారు. విడిపోయిన తర్వాత రాజ్ సిసింద్రీ, రాముడొచ్చాడు వంటి సినిమాలకు సంగీతం అందించారు. అటుపై ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించారు రాజ్. ఆయనతో విడిపోవడం తనను ఇప్పటికీ బాధిస్తుందని కోటి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మళ్లీ వీరిద్దరూ కలిసే ప్రయత్నాలు సఫలం కాలేదు.
చిరంజీవితో యముడికి మొగుడు సినిమా రాజ్-కోటి కెరీర్ ను మలుపుతిప్పింది. అటుపై వీరు స్టార్ మ్యూజిక్ డైరక్టర్లుగా రాణించారు. రాజ్ మృతితో చిత్రప్రముఖులు సంతాపం తెలిపారు.