మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, జనసేన పార్టీలో చేరబోతున్నారట. జనసేనకి చెందిన కొందరు కీలక నేతలు ఇప్పటికే ముద్రగడ పద్మనాభంతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
అయితే, ముద్రగడ పద్మనాభం స్వయంగా జనసేన పార్టీతో టచ్లోకి వచ్చారనీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిసేందుకు సమయం అడిగారనీ, ఈ నేపథ్యంలో గౌరవ ప్రదంగా జనసేన ప్రతినిథి బృందాన్ని పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం వద్దకు పంపించారనే వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం.
కాపు ఉద్యమ నేతగా ప్రత్యేక గుర్తింపు వున్నప్పటికీ, ముద్రగడ పద్మనాభం గత కొంతకాలంగా ‘ప్రో-వైసీపీ’ విధానాన్ని అవలంబిస్తూ, కాపు సామాజిక వర్గంలో కొంత వ్యతిరేకతను చవిచూస్తున్నారు.
వైసీపీ కనుసన్నల్లో పవన్ కళ్యాణ్ మీద కొంత విషం చిమ్ముతూ వచ్చారు ముద్రగడ పద్మనాభం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాల నడుమ, ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
వైసీపీ తనను నమ్మించి మోసం చేసిందన్న ఆవేదనలో వున్న ముద్రగడ, జనసేన వైపు దృష్టి సారించారట. కాపు సామాజిక వర్గ పెద్దలు తనను ఎంతలా తూలనాడినా, వారి మీద తనకు గౌరవం తగ్గదంటూ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తన తప్పు తెలుసుకుని, జనసేన అధినేతకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారట. అయితే, ఈ విషయమై ముద్రగడ నుంచి ఖచ్చితమైన ప్రకటన రావాల్సి వుంది.