24 అసెంబ్లీ, మూడు లోక్ సభ టిక్కెట్ల నుంచి 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ టిక్కెట్ల దాకా సర్దుకుపోవాల్సి వచ్చింది జనసేన పార్టీ, టీడీపీ – బీజేపీలతో పొత్తు కారణంగా. సరే, పొత్తుల రాజకీయాల్లో ఈ సర్దుపోట్లు మామూలే.!
ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత స్ట్రైక్ రేట్తో విజయం సాధించామన్నదే ముఖ్యమన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నమాట. ‘వ్యూహం నాకు వదిలెయ్యండి..’ అని జనసేనాని చేసిన, చేస్తున్న వ్యాఖ్యలపై కొన్ని పెదవి విరుపులు సహజంగానే వస్తున్నాయ్.
రాజకీయ ప్రత్యర్థుల నుంచి హీనాతి హీనమైన కామెంట్లను భరిస్తూ కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘రాష్ట్రం కోసం..’ అంటూ తనదైన రాజకీయ వ్యూహంతో ముందుకు వెళుతున్నారు.
తొలి విడతలో 5 సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇప్పటికి మొత్తంగా పధ్నాలుగు సీట్ల వరకు అభ్యర్థుల్ని ఖరారు చేసేశారు. తాజాగా, ఈ మేరకు ఆయా అభ్యర్థులతో భేటీ అయి, ‘ఖచ్చితంగా గెలవాల్సిందే..’ అని తేల్చి చెప్పారు. అంతే కాదు, రాజకీయ ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు వస్తే, నేరుగా తనను సంప్రదించాలనీ వారికి సూచించారు.
తాడేపల్లిగూడెం సీటు విషయమై కొంత పంచాయితీ నడిచినా, అది జనసేనకే ఖాయమైంది. పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేయబోతున్నారు. పంచకర్ల రమేష్బాబు తదితరులకూ టిక్కెట్లు దక్కాయ్. ఏ సీటుకి ఆ సీటే ప్రత్యేకం.. అన్నట్లుగా అభ్యర్థుల ఎంపిక జరిగింది.
ఇంకో ఏడు సీట్లకు జనసేనాని అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి వుంది. అక్కడితో అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు పూర్తవుతుంది, లోక్ సభకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులనూ జనసేనాని అధికారికంగా ఖరారు చేయాల్సి వుంది. అందులో ఒకటి జనసేనాని పోటీ చేసే స్థానం.. అని అంటున్నారు. ఇంకోటి, వైసీపీ నుంచి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరి కావొచ్చు.
కాగా, భీమిలి నుంచి సందీప్ పంచకర్లకు అవకాశం దక్కాలనీ, అలాగే పోతిన వెంకట మహేష్ సైతం గెలిచే అభ్యర్థి అనీ జనసైనికులు, తమ అధినేతకు సోషల్ మీడియా వేదికగా విన్నవిస్తున్నారు. ఆయా నేతలు, అధినేత నిర్ణయమే శిరోధార్యం అని చెబుతున్నారు.
ఒకటి రెండు రోజుల్లోనే, మొత్తం అభ్యర్థులు ఖరారైపోతారనీ, ఆ తర్వాత జనసేనాని పూర్తిగా జనంలోనే వుంటారనీ జనసేన వర్గాలంటున్నాయి.