స్టార్ యాంకర్ అనసూయ( Anasuya) కన్నీటి పర్యంతమైంది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్, నెగెటివిటీ వల్ల తాను మానసికంగా సతమతమవుతున్నట్లు పోస్ట్ పెట్టింది.
‘ హలో అందరికీ.. ఈ వీడియో చూసి నాకు ఏమైందోనని గందరగోళానికి గురై ఉంటారు. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. తమ సంతోషాన్ని సమాచారాన్ని, లైఫ్ స్టైల్, సంప్రదాయాలని పంచుకునేందుకు సోషల్ మీడియా ఒక వేదిక. కానీ నిజంగా అలా జరుగుతోందా?. నెగిటివిటీ కి సోషల్ మీడియా అడ్డాగా మారింది. నేను ఏ ఫోటోషూట్ చేసినా, పోస్ట్ పెట్టినా, నవ్వుకున్నా, డాన్స్ చేసినా మీతో పంచుకుంటూనే ఉంటాను. ఎందుకంటే అవన్నీ నా లైఫ్ స్టైల్ లో భాగమే. మనుషులన్నాక అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సెలబ్రిటీగా, భార్యగా, అమ్మగా వాటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించాను. చాలా స్ట్రాంగ్ గా ఉండాలని నిర్ణయించుకున్నాను. అలా ఉండడమే నిజమైన బలం అనుకున్నాను. కానీ నేనేం చేసినా నెగిటివిటీ ఏర్పడుతోంది. దయచేసి అందరికి చెప్తున్నా ట్రోల్స్ కామెంట్స్ చేసేముందు అవతలి వాళ్ల పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోండి. నోటికి వచ్చిందల్లా మాట్లాడి అవతలి వారిని మరింత బాధ పెట్టొద్దు. ఈ వీడియో ఐదు రోజుల క్రితం తీసింది. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను’ అని అనసూయ పోస్ట్ పెట్టింది.
సోషల్ మీడియా వేదికగా అనసూయ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఈమధ్య తన ఫ్యామిలీ తో కలిసి ఆమె విహారయాత్రకు వెళ్లి వచ్చింది. సదరు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దానిపై ట్రోలర్స్ రెచ్చిపోయారు. ఇలా ఎన్నోసార్లు ఆమె ట్రోల్స్ ఎదుర్కొంది. దీనిపై అనసూయ బాగా అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ పెట్టిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.