వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.! అంతకు ముందేమో గుండె పోటుతో వివేకా చనిపోయారన్నారు. రక్తపు వాంతులు చేసుకున్నారంటూ కథలు అల్లారు.
చివరికి అది హత్య అని తేలాక, మళ్ళీ కొత్త డ్రామా.! నారాసుర రక్త చరిత్ర.. అంటూ వైసీపీ ఆడిన డ్రామా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సీబీఐ విచారణ దిశగా వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి చేసిన పోరాటం ఫలించింది. అప్పటిదాకా సీబీఐ విచారణ కోరిన వైఎస్ జగన్, అధికారంలోకి రాగానే, సీబీఐ విచారణ అవసరం లేదని తేల్చేశారు.
అప్పటికప్పుడు సునీతా రెడ్డి, వైసీపీకి రాజకీయ ప్రత్యర్థి అయిపోయారు.! చంద్రబాబు మనిషిగా సునీతా రెడ్డి మీద వైసీపీ ఆరోపణలు చేయడం చూశాం. అంతేనా, వైఎస్ వివేకా హత్య వెనుక సునీతా రెడ్డి, ఆమె భర్త పన్నిన కుట్ర దాగి వుందంటూ ఇంకో కొత్త కథని వైసీపీ తెరపైకి తెచ్చింది.
ఇంత డ్రామానా.? ప్రపంచ రాజకీయ చరిత్రలో బహుశా ఎక్కడా ఇలాంటి వింతని చూసి వుండమేమో.! వైఎస్ షర్మిల, సునీతా రెడ్డి మీద తాజాగా వైఎస్ విమలా రెడ్డి గుస్సా అయ్యారు. వైఎస్ విమలారెడ్డి అంటే ఎవరో కాదు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మేనత్తే. వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ‘చిన్న పిల్లాడు’ అనేశారు వైఎస్ విమలారెడ్డి.
ఇంతకీ, వైఎస్ షర్మిలా రెడ్డి కాస్తా షర్మిల శాస్త్రి అయినప్పుడు, విమల పేరు ముందర వైఎస్, పేరు చివర్న రెడ్డి.. ఇవి వుండకూడదు కదా.? అన్న డౌట్ వస్తే, అది మీ తప్పు కానే కాదు.! వైసీపీ రాజకీయాలు ఇలాగే వుంటాయ్. నచ్చినవాళ్ళకి నచ్చిన తోకల్ని కలిపేస్తారు, నచ్చని వాళ్ళ పేర్లను వాళ్ళకు నచ్చినట్లు మార్చేసుకుంటుంటారు.
ఎన్నికల వేళ విమలా రెడ్డి అనూహ్యంగా ఏమీ తెరపైకి రాలేదు. ఆమెది వైఎస్ జగన్ పార్టీ. అద్గదీ అసలు సంగతి. వివేకా డెత్ మిస్టరీ విషయమై తల్లి కాంగ్రెస్ వర్సెస్ పిల్ల కాంగ్రెస్.. ఓ హైడ్రామా నడుస్తోంది.! అది చాలా రసవత్తరంగా సాగుతోంది కూడా.! ఈ కథ ఎలాంటి తీరాలకు చేరుతుందోగానీ, కడప సహా మొత్తం రాయలసీమలో వైఎస్ కుటుంబ కథా చిత్రం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.!