Pawan Kalyan: తనయుడి పెళ్లికి ఆహ్వానిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) పెళ్లి పత్రిక అందజేసారు. బుధవారం హైదరాబాదులో పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన షర్మిల కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అనంతరం పలు అంశాలపై వీరు చర్చించుకున్నారు.
షర్మిల కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో వివాహం జరుగనుంది. వీరి నిశ్చితార్థం జనవరి 18న, వివాహం ఫిబ్రవరి 17న జరగనుంది. ఈ నేపథ్యంలోనే షర్మిల తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను కలుస్తూ కుమారుడి శుభలేఖ అందించి, పెళ్లికి రావాలని ఆహ్వానిస్తున్నారు.
మరోవైపు రాజారెడ్డి- ప్రియ నిశ్చితార్థానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్ వేదికగా కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ హాజరవుతున్నట్టు తెలుస్తోంది. కుమారుడి పెళ్లికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబును కూడా షర్మిల ఆహ్వానించారు.