K.S.Rama Rao: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అరెస్టుపై టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు (K.S.Rama Rao) దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కి బహిరంగ లేఖ రాశారు. మీకు తెలియకుండానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం జగన్ అరెస్టు చేయించారా..? అని ప్రశ్నించారు.
‘మీరు జీ20 సదస్సులో బిజీగా ఉన్నప్పుడు.. సీఎం జగన్ లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్టు జరిగింది. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో ఆయన్ను అన్యాయంగా ఇరికించి అర్ధరాత్రి అరెస్టు చేయించారు. మొదట కేసులో ఏ-37గా పేర్కొని అరెస్టయ్యాక ఏ-1గా పేర్కొన్నారు. 14ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుంటే తెలుగు ప్రజలు స్వచ్ఛంధంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు.’
‘నేషనల్ ఫ్రంట్ కు ఎన్టీఆర్ చైర్మన్ గా ఉన్న సమయంలో బీజేపీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు కృషి చేశారు. 1996లో దేవెగౌడ కంటే ముందే ప్రధాని అవకాశం పొందిన వ్యక్తి. 1999-2004 సమయంలో వాజ్ పేయి ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవడంలో చంద్రబాబుది కీలకపాత్ర. ఎన్డీఏ కన్వీనర్ గా జాతీయస్థాయిలో మీకంటే ముందే జాతీయస్థాయిలో గుర్తింపు సాధించారు. టెక్నాలజీని పరిచయం చేసి భావితరాలకు అందించారు’.
‘విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదాను పక్కనపెట్టి ప్రత్యేక ప్యాకేజీకి మీరు ప్రతిపాదిస్తే రాష్ట్రం మేలు కోసం అంగీకరించారు. ప్రస్తుతం ఏపీ రాజధాని లేకుండా మిగిలిపోయింది. 73ఏళ్ల వయసులో ఆయన నిత్యం ప్రజల కోసం శ్రమిస్తున్నారు. ఇప్పటికైనా జరుగుతున్న పరిణామాలు పరిశీలించి చంద్రబాబుకు న్యాయం చేయండ’ని లేఖలో పేర్కొన్నారు.