Naveen Patnaik: సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనంలా ఉంటారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్( Naveen Patnaik). సీఎం అనే దర్పం, ఆర్భాటం ఏవి కనిపించవు ఆయనలో. ప్రజా శ్రేయస్సు కోసం ఎన్నోసార్లు ఆయనే ఓ మెట్టు దిగిన సందర్భాలు ఉన్నాయి. అలా ఉన్నారు కాబట్టే గత 20 ఏళ్లుగా ఆయన ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన చేసిన పని సాటి ముఖ్యమంత్రిలకు ఆదర్శంగా నిలుస్తోంది.
అభివృద్ధి పనులు చేయించడంలో రాజీపడని పట్నాయక్ తండ్రి సమాధిని తొలగించారు. 2019 లో పూరీ లోని స్వర్గధారా స్మశాన వాటికలో సుందరీ కరణ పనులు చేపట్టారు. అందులో భాగంగా ఆ స్మశాన వాటికను విస్తరించాల్సి వచ్చింది. ఇందుకు నవీన్ తండ్రి బిజు పట్నాయక్ సమాధి అడ్డుగా ఉండడంతో దాన్ని తొలగించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తన తండ్రి ఆ రాయిలో లేడని తన గుండెల్లో ఉన్నాడని ఉటంకిస్తూ ఆయనే దగ్గరుండి ఆ సమాధిని బద్దలు కొట్టించారు. ఈ విషయాన్ని సీనియర్ బ్యూరోక్రాట్, నవీన్ పర్సనల్ సెక్రటరీ వీకే పాండియన్ స్వయంగా వెల్లడించారు.
దుబాయ్ లో జరిగిన ఒడిశా దివస్ వేడుకల్లో భాగంగా ఆయన ఈ విషయం గురించి బయటపెట్టారు. పూరీ పవిత్ర పుణ్యక్షేత్రమని, అక్కడికి యాత్రికులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు కాబట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావించిన సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో మరోసారి నవీన్ పట్నాయక్ వార్తల్లో నిలిచారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్నాయక్ ని ఆదర్శంగా తీసుకోవాలంటూ ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.