మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న ‘యువగళం’ పాదయాత్రకు సంబంధించి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో.. అందునా, భీమవరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. యువగళం పాదయాత్రపై వైసీపీ శ్రేణులు రాళ్ళ దాడులు చేశాయన్నది టీడీపీ ఆరోపణ.
టీడీపీ విడుదల చేసిన ఫొటోలు, వీడియోల్లో ఆ విషయం స్పష్టమవుతోంది. పోలీసులు, వైసీపీ శ్రేణులకు రక్షణగా నిలుస్తున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది కూడా.! మరోపక్క, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నారా లోకేష్కి, పోలీసులు నోటీసులు అందించే ప్రయత్నం చేశారు.
అయితే, పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని తీసుకునేందుకు నారా లోకేష్ తిరస్కరించారు. ‘మీకున్న సమస్యల వల్ల మీరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండొచ్చు. కానీ, మీ బాధ్యత శాంతి భద్రతలను పరిరక్షించడం’ అంటూ తనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీస్ అధికారులకు క్లాస్ తీసుకున్నారు మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్.
సుదీర్ఘంగా యువగళం పాదయాత్ర కొనసాగుతోందనీ, ఎక్కడా ఉద్రిక్త పరిస్థితులు లేవనీ, ఇక్కడ మాత్రం, కావాలని వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు దిగిందనీ, స్థానిక ఎమ్మెల్యే రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని లోకేష్ ఆరోపిస్తున్నారు. అధికార వైసీపీ పెడుతోన్న అభ్యంతరకర ఫ్లెక్సీలకు పోలీస్ శాఖ ఎలా అనుమతిస్తోందని నారా లోకేష్ ప్రశ్నించారు.
‘మేం అధికారంలో వున్నప్పుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. మా శ్రేణులు ఎక్కడా ఆయన మీద దాడికి యత్నించలేదు. మేం ఎక్కడా ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టలేదు. పాదయాత్ర సందర్భంగా, అప్పటి ముఖ్యమంత్రిపై వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా దుర్భాషలాడారు. కానీ, అప్పట్లో మేం పోలీసుల్ని, వైఎస్ జగన్ మీదకు ప్రయోగించలేదు..’ అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు లోకేష్.
లోకేష్ మాట్లాడుతున్నంతసేపూ, పోలీసులు అట్నుంచి ఎలాంటి సమాధానమూ ఇవ్వలేకపోయారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది.?
అధికార పార్టీ ఫ్లెక్సీల విషయంలో పోలీస్ శాఖ ఎందుకు మౌనం దాల్చుతోంది.? వైసీపీ దాడుల్లో పోలీసులూ గాయపడినా, పోలీసు శాఖ ఎందుకు స్పందించలేదన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్గా మారింది.