ప్రజలకు అన్నీ చేశాం.! మళ్ళీ మనల్నే ఎందుకు గెలిపించరు.? చాలా చాలా మేలు చేసేశాం కాబట్టి, ఆ చేసిన పనులు చెప్పుకుంటే సరిపోతుంది.. మనమే గెలుస్తాం.. ఈసారి మరింత ఘనంగా.!
గతంలో వైసీపీ ఎమ్మెల్యేలతో, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలివి.! 2019 ఎన్నికల్లో 151 మంది సీట్లు గెలుచుకున్నాం కాబట్టి, ఇంకాస్త కష్టపడితే 175 సీట్లూ గెలిచేస్తామని పార్టీ ముఖ్య నేతలకు వైఎస్ జగన్ అప్పట్లో దిశా నిర్దేశం చేశారు.
‘నేనైతే క్యాలెండర్ ప్రకారం బటన్లు నొక్కుకుంటూ వెళుతున్నాను. జరిగిన మేలుని మీరు జనాలకి చెప్పడం, వారి నుంచి ఆశీర్వాదం తీసుకోవడం పెద్ద పనేమీ కాదు..’ అంటూ వైఎస్ జగన్, ఎమ్మెల్యేలకు ఉపదేశాలూ చేసిన సంగతి తెలిసిందే.
కానీ, కింది స్థాయిలో పరిస్థితులు చాలా భిన్నంగా వున్నాయి. సంక్షేమ పథకాల పేరుతో జనాల జేబుల్లోకి డబ్బులు వెళుతున్నాయ్ సరే.. కానీ, ధరల పెంపుతో, వారి జేబులకు చిల్లులు అదనంగా పెడుతున్నదీ వైఎస్ జగన్ సర్కారే కదా.
మద్యం ధరల దగ్గర్నుంచి, పెట్రో ధరల వరకు.. వాట్ నాట్.. అన్నీ వాయింపే.! విద్యుత్ ఛార్జీల వ్యవహారం మరింత దారుణం.! రోడ్లేమో నరకం. చెప్పుకుంటూ పోతే చాలానే. ఇవన్నీ, ఖచ్చితంగా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉద్యోగులు మంట మీదున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా.? అని ఎదురుచూస్తున్నారు.
చివరికి వైసీపీ కార్యకర్తలైన వాలంటీర్లు సైతం సంతోషంగా కనిపించడం లేదాయె.! అన్నిటికీ మించి, ఎమ్మెల్యేల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే నమ్మకం లేకుండా పోయింది. అందుకే, అభ్యర్థుల మార్పు.!
ప్రభుత్వం అంత గొప్పగా అన్నీ చేసేస్తే, ఎమ్మెల్యేల పనితీరు అనేది పరిగణనలోకి కూడా రాదు.! అభ్యర్థుల్ని మార్చడమంటే, ప్రభుత్వ పనితీరు మీదనే ముఖ్యమంత్రికి నమ్మకం లేనట్టు. తమ మీద ముఖ్యమంత్రికి నమ్మకం లేకపోవడాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ఇంతటి అయోమయంతో అధినేత వుంటే, పార్టీ బతికి బట్టకట్టడం కష్టం..’ అని వైసీపీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది.