Ram Charan: అయోధ్య (Ayodhya) లో జనవరి 22న ప్రతిష్ఠాత్మకంగా జరుగనున్న శ్రీరామ మందిరం ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ (Ram Charan) , ఉపాసన (Upasana) దంపతులు ఆహ్వానం అందుకున్నారు. ఈమేరకు రామమందిరం ట్రస్టు ప్రతినిధులు శుక్రవారం వీరిని కలిసి ఆహ్వానం అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్, ఉపాసన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. దేశంలోని పలువురు ప్రముఖులకు ట్రస్టు ఆహ్వానం పలుకుతోంది.
ఆహ్వానం అందుకున్న ప్రముఖుల్లో చిరంజీవి, అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, ప్రభాస్, రణబీర్ కపూర్, రాజ్ కుమార్ హిరాణీ, రోహిత్ శెట్టి, ధనుష్ తదితర సినీ ప్రముఖులు ఉన్నారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఈ ప్రారంభోత్సవానికి దేశ ప్రజల తరపు నుంచి ప్రతినిధిగా ఉండటం తన అదృష్టమని ఓ సందేశంలో పేర్కొన్నారు.
భారతావని మొత్తం శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం ఎదరు చూస్తోంది. ఇప్పటినుంచే భక్తులు వివిధ రూపాల్లో తమ భక్తిని చాటుకుంటున్నారు. హనుమాన్ చిత్ర బృందం ప్రీమియర్లతో వచ్చిన మొత్తంలో రూ.5చొప్పున రూ.14.25లక్షలను రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చింది.