తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్ళడం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవడం తెలిసిన విషయాలే.
‘అబ్బే, అస్సలు ఆ భేటీనే జరగలేదు’ అని అంటోంది వైసీపీ.! ఇదో ఆసక్తికరమైన అంశం. ఇంతకీ, చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలిశారా.? లేదా.? బీజేపీ – టీడీపీ పొత్తు గురించి చర్చించారా.? లేదా.?
అమిత్ షా, జేపీ నడ్డా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో చంద్రబాబు చాలా చాలా కష్టపడ్డారనీ వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణరాజు సహా, పలువురు పారిశ్రామికవేత్తలు సాయం చేశారనీ.. వైసీపీ అను‘కుల’ మీడియానే ప్రచారం చేసింది.
‘అమిత్ షా.. చంద్రబాబుని ఛీ కొట్టారట..’ అంటూ వైసీపీనే కథనాలు అల్లింది.. అల్లుతూనే వుంది. అలాంటప్పుడు, అమిత్ షా – చంద్రబాబు భేటీ జరగలేదని వైసీపీ అనడంలో అర్థం లేదు కదా.!
ఇంతకీ అమిత్ షా – చంద్రబాబు ఏం మాట్లాడుకున్నారు.? పొత్తుల చర్చలు సఫలమయ్యాయా.? లేదా.? సీట్ల పంపకాలు ఎలా వుండబోతున్నాయి.? ఈ అంశాలపై టీడీపీ, వైసీపీ అనుకూల మీడియాల్లో రకరకాల కథనాల్నీ చూశాం.
అయినాగానీ, చంద్రబాబు ఢిల్లీ టూర్ మీద వైసీపీకి సరైన సమాచారం దొరకడంలేదట. వైసీపీ ఇంటెలిజెన్స్ ఈ వ్యవహారాల్ని కనుగొనలేకపోవడంతో వైసీపీ అధినాయకత్వం గుస్సా అవుతోందిట. ప్రత్యర్థి వ్యూహాలు తెలిస్తేనే కదా.. ప్రతి వ్యూహాలు వైసీపీ సిద్ధం చేసుకోగలదు.? బీజేపీలోని ప్రో-వైసీపీ నేతలకు కూడా చంద్రబాబు ఢిల్లీ టూర్ విషయమై సరైన సమాచారం లేకపోవడం కొసమెరుపు ఇక్కడ.!