అరరె.! వైసీపీ కార్యకర్తలకు ఎంత కష్టమొచ్చింది. ప్రజాశాంతి పార్టీ నుంచి డీఎంకే పార్టీ దాకా.. బోల్డన్ని రాజకీయ పార్టీల జెండాల్ని, ఎజెండాల్నీ మోస్తున్నారిప్పుడు. కారణం ఒక్కటే.. పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం గురించి ఎప్పుడైతే బలంగా నినదించడం మొదలు పెట్టారో, అదీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్, సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడటం మొదలు పెట్టారో.. అప్పటినుంచి వైసీపీ శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.
పవన్ కళ్యాణ్ మీద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు చేస్తే, ఆ పార్టీ జెండా, ఎజెండా పట్టుకుని సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు వైసీపీ కార్యకర్తలు. డీఎంకే నేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘వెయిట్ అండ్ సీ’ అంటూ చేసిన వ్యాఖ్యలకి వైసీపీ శ్రేణులు ఇస్తున్న ఎలివేషన్స్ అన్నీ ఇన్నీ కావు.
బీఆర్ఎస్ మద్దతుదారుడైన ప్రకాష్ రాజ్, వున్నపళంగా వైసీపీ జెండా పట్టుకున్నట్లుగా, వైసీపీ ఎజెండాని మోస్తున్నట్లుగా మారిపోవడం గమనార్హం. బీఆర్ఎస్ మీద ఈగ వాలనివ్వడంలేదు గత కొంతకాలంగా వైసీపీ కార్యకర్తలు.
ఇంకోపక్క, రాహుల్ గాంధీని పవన్ కళ్యాణ్ విమర్శించడంతో, కాంగ్రెస్ జెండా మెయడానికి కూడా వైసీపీ కార్యకర్తలు సిద్ధమైపోయారు. రాహుల్ గాంధీ ఎంత గొప్పోడో తెలుసా.. అంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా లెక్చర్లు దంచేస్తున్నారు.
వైసీపీ కార్యకర్తలకి ఇప్పుడు తమిళనాడుకి చెందిన పెరియార్ ఓ ఆశాదీపంలా కనిపిస్తున్నాడు. పెరియార్ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నట్లుగా వైసీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యకరం. ఇదంతా వైసీపీ అధినేత వైఎస్ జగన్, బెంగళూరు – విజయవాడ మధ్య షటిల్ సర్వీస్ చేస్తుండడం వల్లే.. ఆ అధినేత మీద నమ్మకం లేకపోవడం వల్లే జరుగుతోందా.? అంతేనేమో.!
ఇన్ని పార్టీల జెండాలు, ఎజెండాలు మోస్తున్న వైసీపీ కార్యకర్తలు నిఖార్సయిన జెండా కూలీలుగా మారిపోయారు. చూస్తోంటే, ఇతర దేశాల్లోని రాజకీయ పార్టీల జెండాల్ని కూడా మోయడానికి వైసీపీ కార్యకర్తలు సిద్ధమయ్యేలానే కనిపిస్తున్నారు.