అరరె.. ఎంత పనైపోయింది.? వైసీపీ నేతలు రోడ్డున పడ్డారు.! ఇంట్లో పడుకోవడానికి మనశ్శాంతి కరువై, రోడ్డు మీద నిద్ర పోయారు.! ఇదీ, జన బాహుళ్యంలో జరుగుతున్న చర్చ.!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోశాలలో గోవులు మృత్యువాత పడుతున్నాయంటూ వైసీపీ చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా దాదాపు 190 వరకు గోవులు మృతి చెందాయన్నది వినిపిస్తున్న వాదన.
గోశాలలో గోవుల మృతి అత్యంత బాధాకరం. గోవుల మృతికి అనేక కారణాలుంటాయ్. ఏప్రిల్లోనూ దాదాపు ఇరవై ఆవులు మృతి చెందాయని లెక్కలు చెబుతున్నాయి. అప్పట్లో ఎవరు అధికారంలో వున్నారు.? అంతకు ముందు గోవులు చనిపోవడానికి కారణాలేంటి.?
కూటమి హయాంలోనే గోవులు చనిపోతున్నాయన్నది వైసీపీ ఆరోపణ. సాధారణ మరణాలు మామూలేనని కూటమి ప్రభుత్వం, టీటీడీ చెబుతున్నాయి. గోవుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఇప్పటికే స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే.
గోశాలను సందర్శించే విషయమై టీడీపీ – వైసీపీ మధ్య రాజకీయ మాటల యుద్ధం నడిచింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య.. వైసీపీ నేతలు, గోశాల వైపు పరుగులు తీశారు. అయితే, వేల మందిని వెంటేసుకుని వైసీపీ నేతలు, గోశాల వైపు పరుగులు తీయడంతో, సహజంగానే పోలీసులు, వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.
పరిమిత సంఖ్యలో నాయకులకు గోశాల సందర్శన కోసం అనుమతిస్తామని పోలీసులు చెబితే, ససేమిరా అంటూ రోడ్డు మీద బైఠాయించారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా తదితరులు. ఈ క్రమంలో రోడ్డు మీద నిద్ర చేసి.. నవ్వులపాలయ్యారు.
గతంలో, హైద్రాబాద్ నుంచి మంగళగిరికి పవన్ కళ్యాణ్ వెళ్ళేందుకు ప్రయత్నిస్తే, అప్పటి వైసీపీ సర్కారు, ప్రత్యేక విమానాన్ని రద్దు చేయించింది. రోడ్డు మార్గాన వెళితే, ఆంధ్రా బోర్డర్లో అడ్డుకోవడం, ఈ క్రమంలో రోడ్డు మీద పవన్ కళ్యాణ్ బైఠాయించడం తెలిసిన విషయమే.
అదే, వైసీపీ పతనానికి కారణమైంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నానా విమర్శలూ చేసి, ఇప్పుడు అదే రోడ్డున పడింది వైసీపీ. కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు. వైసీపీ ఇవే తరహా రాజకీయాలు చేస్తే, రాజకీయంగా వైసీపీకి శాశ్వత సమాధి తప్పదు.
