కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం వైసీపీ హయాంలో ‘కల్తీ’కి గురయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో, కేసులు నమోదయ్యాయి.. అరెస్టులు కూడా జరిగాయి.
టీటీడీకి అప్పట్లో నెయ్యి సరఫరా చేసిన కంపెనీల ప్రతినిథులు అరెస్టవడం, విచారణలో నిందితులు ‘కల్తీ’ని అంగీకరించడం తెలిసిన విషయాలే. అనామక కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టిన టీటీడీ అధికారులు, వారిని అటు వైపుగా నడిపించిన అప్పటి టీటీడీ ఛైర్మన్, అప్పటి ప్రభుత్వ పెద్దలు.. అందరిపైనా విచారణ జరుగుతోంది.
తాజాగా, ఈ కేసుకు సంబంధించి, సీబీఐ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, సర్వోన్నత న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపించింది.. అదీ నిందితుల విషయమై. ‘అసలు వాడింది నెయ్యే కాదు’ అన్నది సీబీఐ వాదన. అదేంటీ, వాడింది కల్తీ నెయ్యి కదా.? అసలంటూ నెయ్యే కాదని సీబీఐ అంటోందేంటి.? అని అంతా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
పామాయిల్, కొన్ని రసాయనాలు కలిపి కల్తీ నెయ్యిని తయారు చేశారన్నది సీబీఐ వాదన. ఇది మామూలు విషయం కాదు. కలిపిన రసాయనాలు ఏంటి.? నెయ్యి పేరుతో, ప్రసాదంలో వాడేందుకు ఎవరు అనుమతులిచ్చారు.? వంటి అంశాలకు సంబంధించి నిజాలు నిగ్గు తేలాలి.
అయితే, వైసీపీ వాదన మరోలా వుంది. ‘అసలు నెయ్యే కాదని సీబీఐ అంటోంది.. పామాయిల్, రసాయనాలు కలిపారని సీబీఐ చెబుతోంది. అలాంటప్పుడు, నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరులు ఆరోపించడం తప్పే కదా..’ అన్నది వైసీపీ వాదన.
వైసీపీ కల్తీ రాజకీయాలు ఇలా వుంటాయి. అంటే, లడ్డూలో నెయ్యి వాడాల్సి వుండగా, నెయ్యి వాడకుండా, పామాయిల్ అలానే రసాయనాలతో తయారు చేసిన పదార్థాన్ని తమ హయాంలో వినియోగించామని వైసీపీ పరోక్షంగా ఒప్పుకుంటున్నట్లే కదా.?
హత్య చేశాం.. కానీ, అందరూ ఆరోపిస్తున్నట్లు గొడ్డలితో నరకలేదు.. కత్తితో కడుపులో పొడిచి చంపేశాం.. అన్నట్లుంది వైసీపీ వాదన.
