వైసీపీ నేత శోభా నాగిరెడ్డి, ఎన్నికల ప్రచారంలో దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె వైసీపీలో వుండేవారు. వైసీపీ అభ్యర్థిగా ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమె చనిపోయారుగానీ, గెలిచేశారు.! ఆ తర్వాత ఉప ఎన్నిక వచ్చిందనుకోండి.. అది వేరే చర్చ.
శోభా నాగిరెడ్డి మరణానికి సంబంధించి నేరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద మోపెయ్యగలమా.? ఛాన్సే లేదు.! అనూహ్యమైన రీతిలో జరిగిన ప్రమాదమది. ఘోర రోడ్డు ప్రమాదమే.! దాన్ని ప్రమాదంగా మాత్రమే చూడాలి. పార్టీ అధినేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ ఘటనకు ఎలా బాధ్యత వహిస్తారు.?
అలాగే, ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూసేందుకు వచ్చి, తిరిగి వెళ్ళే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు అభిమానులు చనిపోవడం కూడా అనూహ్య ఘటనే. ‘దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. సినిమా మీకు ఆనందాన్నిస్తుంది. ఇంటికి వెళ్ళే సమయంలో అజాగ్రత్తగా వుండొద్దు.. మీకేమైనా జరిగితే మీ కుటుంబ సభ్యులు బాధపడతారు.. మాకూ ఆ బాధ వుంటుంది..’ అని చేతులు జోడించి మరీ, అభిమానులకు విజ్ఞప్తి చేశారు సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకి బాధ్యత వహిస్తూ, ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలనీ, పవన్ కళ్యాణ్ని వెంటనే అరెస్ట్ చేయాలనీ వైసీపీ నేతలు కొందరు డిమాండ్ చేసెయ్యడం మొదలు పెట్టారు.
పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతలు, ఒక్కసారి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదాన్ని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చూసి, తిరిగి వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురైన అభిమానులకు సంబంధించి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సి వస్తే, శోభా నాగిరెడ్డి మరణానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యుడవుతారు కదా.?
‘పుష్ప 2 ది రూల్’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన ఘటన వేరు. అక్కడ తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ రాక వల్ల జరిగిన తొక్కిసలాట. పోలీసులు వద్దంటున్నా అల్లు అర్జున్ ఆ థియేటర్కి వచ్చాడన్నది అసలు విషయం.
దానికీ, ‘గేమ్ ఛేంజర్’ ఘటనకీ అస్సలు సంబంధం లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో నిర్వహించిన బహిరంగ సభల దగ్గరే పలవురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా కూడా పలువురు ప్రాణాలు కోల్పోవడం చూశాం.
2024 ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం తర్వాత వైసీపీ నేతలకు పూర్తిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అప్పటినుంచి వారి మానసిక స్థితి అస్సలేం బావున్నట్టు లేదు. ‘పుష్ప 2 ది రూల్’ సినిమా హీరో అల్లు అర్జున్ తరఫున వకాల్తా పుచ్చుకుంటారు.. తమిళ రాజకీయ నాయకుడు, అక్కడి డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తరఫున మాట్లాడతారు.. ప్రకాష్ రాజ్ని వెనకేసుకొస్తారు.. తమిళ కమెడియన్లనీ సమర్థించేస్తుంటారు.. ఇదంతా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే సుమీ.!
‘గేమ్ ఛేంజర్’ ఘటన విషయంలోనూ వైసీపీ నేతల తుత్తర అదే.! ముందైతే, సోకాల్డ్ వైసీపీ నేతలకి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకీ మానసిక చికిత్స అవసరం. ఆ దిశగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
